Thursday, February 19, 2009

రాంబాబు - కధాన్వేషణ

Thursday, February 19, 2009
రాంబాబు – కధాన్వేషణ


రాంబాబు పదోసారి నొక్కుల్లేని క్రాఫ్ ని కష్టపడి వేజలైన్ రాసి నొక్కుల జుట్టుగా కనిపించేట్లు
దువ్వుకున్నాడు. అందమైన ఆడపిల్లలకి నొక్కుల జుట్టంటే అభిమానమని రాంబాబు నమ్మకం. అద్దంలో దూరంనుంచి, దగ్గరనుంచి వివిధ భంగిమల్లో చూసుకుని, రైఠో రాంబాబూ, నీ ముందు వందమంది సినిమా హీరోలయినా దిగదుడుపే అని తనని తను మెచ్చుకుని, తల కదిపితే నొక్కుల జుత్తు ఎక్కడ పాడవుతుందోనని మెడ బిగ పట్టుకుని రూమ్ లాక్ చేసి రోడ్డుమీదకొచ్చాడు, ‘మనిషి రోడ్డున పడ్డాడు’ అనుకుంటూ సినిమా పిచ్చి రాంబాబు.

అయితే ఇప్పుడు రాంబాబు వెళ్ళేది ఏ కొత్త తెలుగుసినిమాకి కాదండోయ్, అతను వెళ్ళేది అమ్మాయిల వేటకీ కాదు. అందమైన అమ్మాయిలు కనబడితే కొంచెం పోజిస్తాడంతేగానీ రాంబాబు చాలా బుధ్ధిమంతుడే. అమ్మాయిలంతా తను చాలా అందగాడనుకోవాలనీ, తనంత గొప్ప రచయిత ప్రపంచంలో లేడని అనుకోవాలనే సదుద్దేశ్యం తప్ప వేరే దురుద్దేశ్యం లేని మంచి బాలుడు.

రాంబాబు ఒక చిన్న సైజు రచయిత. చిన్న సైజంటే మనిషి కాదండీ బాబూ. రాంబాబుకేం ఇంచక్కా యద్దనవాడి సలోచనారాణి నవలల్లో నాయకుడిలా వుంటాడు. అతని కధలేవో ఒకటి రెండు, రెండు మూడు నెలలు బ్రతికిన పత్రికల్లో పడ్డాయి. అప్పటినుంచీ రాంబాబుకి తానో గొప్ప కధకుడననే విశ్వాసం. ఆ విశ్వాసంతోటే ఏదో ఒక నాటికి ఆఖిలాంధ్ర ప్రజానీకానికీ తానే అభిమాన రచయిత నవుతానని కలలుగంటున్నాడు – అదేదో సినిమాలోలా ‘ఆశ, అశ, అశ’ అని గొణిగే మనసును లెక్కచేయకుండా.

ప్రస్తుతం ఒక ప్రముఖ మాస పత్రిక నిర్వహిస్తున్న కధల పోటీకి ఒక మాంచి కధరాసి పంపాలని, మొదటి బహుమతి తనకే రావాలని ఆశించి, అంత మంచి కధ ప్లాటుకోసం వెతుక్కుంటూ రోడ్డున పడ్డాడు రాంబాబు. మనిషన్న తర్వాత ఆశ వుండకుండా వుండదు కదండీ. అయ్యో, మనం కబుర్లల్లో పడి రాంబాబు సంగతి మరచిపోయాం.

ఆ, అదిగో అక్కడ చౌరస్తాలో నుంచుని వచ్చే పోయే వాళ్ళని గమనిస్తున్నాడు శ్రధ్ధగా మన కధానాయకుడు. ఎందుకైనా మంచిదని విఘ్నేశ్వరుణ్ణి మనసులోనే ప్రార్ధించాడు మంచి ప్లాటు దొరికేట్లు చెయ్యమని.

ఇంతలో ఓ నలుగురు కాలేజీ అమ్మాయిలు రాంబాబుకి కొంచెం దూరంలో వచ్చి నుంచున్నారు. కాలేజీ అమ్మాయిల కధయితే పసందుగా వుంటుందని వాళ్ళవంక దొంగ చూపులు చూస్తూ వాళ్ళ సంభాషణ వినసాగాడు. అయితే పాపం ఎంత శ్రధ్ధగా విన్నా వాళ్ళే భాషలో మాట్లాడుకుంటున్నారో రాంబాబుకర్ధంకాలేదు. కాలేజీ అమ్మాయిలకంటూ ప్రత్యేకమైన భాష ఒహటుందా అనే డైలమాలో పడిపోయాడు కాసేపు అంతా అబ్బాయిలే వున్న కాలేజీలో చదివిన రాంబాబు. వాళ్ళందరి నోటినుంచి కామన్ గా వస్తున్న శబ్దాన్ని మాత్రం రీసెర్చి చేసి కనిపెట్టాడు మన బ్రిలియంట్ బాయ్. అదేమిటో మీకు తెలుసా తెలియదా అయితే రాంబాబునే అడుగుదాం. ‘యా’ జగదేకవీరుని కధ సినిమా వచ్చిన కొత్తల్లో ‘ హలా’ అని పలకరించుకున్నట్లు, ఇప్పడు ప్రతిదానికి ‘యా’ అనటం ఫేషన్ కాబోలు అనుకున్నాడు. క్షణక్షణానికీ మారుతున్న ఫాషన్లతో పరిగెట్టలేని మన హీరో మొత్తానికి అక్కడక్కడా అర్ధమయిన కాలేజీ అమ్మాయిల సంభాషణ సినిమాలమీద, ఫేషన్లమీద, మొగవాళ్ళని తిట్టటంమీద (మహిళా దశాబ్దం కాబోలు) తప్పితే వేరే లేదనీ, అందులో తన కధకు పనికివచ్చే బ్రహ్మాండమైన ప్లాటేమీలేదని గ్రహించేసరికి రాంబాబుకి నీరసం వచ్చి ఎదురుకుండా కన్పడ్డ హోటల్లోకెళ్ళాడు కాఫీ తాగుదామని.

ఆక్కడ దృశ్యాన్నిచూసి రాంబాబు హృదయం ద్రవీభవించింది. సర్వర్ చెయ్యిజారి కాఫీకప్పు ఒక సూట్ వాలా సూట్ మీద పడినట్లుంది పాపం. ఆ సూట్ వాలా మాత్రం ఏం చేస్తాడు. సూటంత నీట్ గా మనసట్టిపెట్టుకోవాలని తెలియక రెచ్చిపోయి ఇష్టమొచ్చినట్లు అరుస్తున్నాడు. మర్యాదస్తులకి అమర్యాద జరిగితే హోటల్ పేరెక్కడ పాడవుతుందోనని హోటల్ ప్రొప్రయిటర్ సూట్ వాలాకి నచ్చచెప్ప ప్రయత్నించి విఫలుడై, ఈ సర్వర్ కాకపోతే ఇంకొకడు దొరుకుతాడని సర్వర్ ని మెడపట్టి బయటగ్గెంటుతున్నాడు వుద్యోగం మానుకుని పొమ్మని.

రాంబాబు అర్జంటుగా ఆలోచనల్లోకి వెళ్ళిపోయాడు ఒక మూలగా టేబుల్ దగ్గర కూర్చుని. ఈ సంఘటన కధ రాస్తే ఎలా వుంటుంది? ‘ సంస్కారం లేని సంఘం’ అని పేరు పెట్టవచ్చు. అబ్బో పేరు మోతెక్కిపోతోంది. ఇంతకీ కధ ఎక్కడ మొదలు పెట్టాలి? కప్పు జారిన దగ్గరనుంచా? లేక సూట్ వాలా తిట్లతో మొదలు పెట్టి కప్పు జారి పడటం ఫ్లాష్ బాక్ లో చెప్తేనో – అమ్మో తనకి సినిమా రచయితల ఆలోచనలొచ్చేస్తున్నాయి. ఏమో ఎవరు చెప్పగలరు. ఏదో ఒక నాటికి రాంబాబు ది గ్రేట్ సినీ రైటర్ అయిపోతాడేమో. అప్పడు తనకెంత పేరు – టైటిల్స్ లో తనపేరు చూసుకోవచ్చు. తను రోడ్డుమీద వెళ్తుంటే ఈయనే ఫలానా సినిమాల రచయిత అని అంతా తనగురించే చెప్పుకుంటారు. ఒకవేళ కధకి మొదటి బహుమతి వస్తే ఇదే సినిమాగా తీస్తారేమో ఎవరు చెప్పగలరు. తన ఆలోచనలు ఎక్కడనుంచి ఎక్కడికి వెళ్ళాయో గమనించిన రాంబాబు ఒక్క క్షణం సిగ్గుపడిపోయాడు. మళ్ళీ కధ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. తను హోటల్ లో ప్రవేశించడం దగ్గరనుంచి మొదలుపెడితేనో - తనకీ ఒక పాత్ర కల్పించుకోవచ్చు. అప్పుడు తనపేరు రాంబాబు అని రాసుకోవాలా లేకపోతే పేరు లేకుండా నేను అంటూ రాయాలా

అసలు ఆ సర్వర్ చెయ్యిజారి కప్పు కిందపడటానికి కారణం సర్వారాయుడి అశ్రధ్ధా? అతనా రోజు భోజనంచేసి వుండడా? ఇంటి దగ్గరున్న ఏ జబ్బు తల్లి గురించో తండ్రి గురించో ఆలోచిస్తున్నాడా ? అదీ ఇదీగాక పిల్లాడి పాలడబ్బా గురించి వర్రీ అవుతున్నాడా? అదయ్యుండదు. ఎందుకంటే అతనికి పట్టుమని పధ్ధెనిమిదేళ్ళుకూడా వున్నట్టులేవు. అర్ధగంట ఆలోచించినా ఏదీ తేల్చుకోలేకపోయాడు రాంబాబు. పోనీ ఇందులో ఏ కారణమయితే చదువరులకి ఆ సర్వర్ మీద జాలి కలుగుతుంది? అతన్నే అడగితే పోలా అసలు సంగతి. ఆలోచనల్లోంచి తేరుకుని చుట్టూ చూశాడు. సూట్ వాలా వెళ్ళిపోయాడు. సర్వారాయుడికీ ప్రొప్రయిటర్ కీ సంధి ఎలా జరిగిందోగానీ పక్క టేబుల్ దగ్గర వాళ్ళకి దోశ ఇస్తున్నాడు. అయ్యో, దొరికిన ప్లాట్ చేజారిపోయిందే అనుకుంటూ కాఫీతాగి బయటకొచ్చాడు రాంబాబు.

‘బాబూ, పసిగుడ్డుకి పాల్లేవండీ. ఒక్క పదిపైసలెయ్యండి బాబూ, దరమ పెబువులు’ ఒక నడి వయసు స్త్రీ చేటలో రోజుల పసిపిల్లని పెట్టుకుని రాంబాబు ముందు చెయ్యిజాపింది. పోనీ ఈ స్త్రీ గురించి కధ రాస్తే అనుకున్నాడు. అయినా ఆ పిల్లలు వాళ్ళ సొంత పిల్లలు కారుట. వాళ్ళను అద్దెకు తెస్తారుట. అంత జగజ్జంత్రీల కధ తనేం రాయగలడు. తన కధ అందంగా, సాఫీగా, చదువరులను సమ్మోహపరిచేదిగా, ఇంతకు ముందు ఎవ్వరూ రాయనిదిగా వుండాలి. బిచ్చగాళ్ళమీద ఇదివరకు చాలా కధలొచ్చాయి అనుకుంటూ ముందుకు సాగాడు. ఆలోచనల్లోపడ్డ రాంబాబు పైసలిచ్చే రకంగాదని గ్రహించిన ఆ బిచ్చగత్తె ఎప్పుడో ఇంకొకళ్ళ దగ్గరకెళ్ళింది.

కధ రసవత్తరంగా సాగాలంటే ప్రేమికుల కధ రాస్తేనో – ప్రేమికులు కలుసుకుంటే ఏం మాట్లాడుకుంటారో సినిమాల్లోలాగా ‘రాధా అందించు నీ లేత పెదవీ అని పాడుకుంటారా’ .....ఛీ పాడు మరీ అంత పబ్లిగ్గా పాడుకునే ప్రేమికులుకూడా వుంటారా ఒకవేళ వున్నా తనలాంటి కధల జోలికి పోకూడదు. మనసులోనే తీర్మానించుకున్నాడు.

పోనీ...కొత్తగా పెళ్ళయిన జంట కధ రాయాలంటే....హిహిహి....తనకేం తెలుస్తుంది ఏం రాయాలో.....ఆ....అయిడియా....ఇప్పుడు ఆడవాళ్ళంతా సమాన హక్కులు వగైరా నినాదాలేవో చాలా చేసేస్తున్నారుగా – వాళ్ళ గురించి ఏమైనా రాస్తే.....ఇంతకీ వాళ్ళక్కావాల్సిన సమాన హక్కులేమిటో ఉద్యోగాల్లోనా.. - ఆడవాళ్ళు ఇంటర్వ్యూకొస్తే మాకుద్యోగాలు దొరకటం లేదో అని గోల పెడుతున్నారు మెగవాళ్ళు. ఇంటి పెత్తనంలోనా.. అదెటూ వాళ్ళ రాజ్యమే – సినిమాలూ షికార్లల్లోనా .... ఈ మధ్య ఎక్కడ చూసినా ఆడవాళ్ళే. పెళ్ళిళ్ళల్లోనా ... ఈ మధ్య ప్రేమ పెళ్ళిళ్ళెక్కువయి పోయాయి. మరి వీళ్ళకున్న సమస్యలేమిటబ్బా.... వాళ్ళ సమస్యలేవో కనుక్కోవటానికి నేను ఆడపిల్లగా పుట్టాల్సి వచ్చేట్లుంది అనుకున్న రాంబాబుకి మనసు ధైర్యం చెప్పి ఓదార్చింది. రేపెటూ సెలవు పెట్టి వూరెళ్తున్నావు గదా చెల్లాయినడుగు వాళ్ళ సమస్యలేమిటో అని. దానికసలు తెలుసా నాకు చెప్పటానికి అనిపించినా వేరే మార్గంలేక కధ రాయటం తప్పనిసరిగా పోస్ట్ పోన్ చేసుకున్నాడు పాపం రాంబాబు.. .. తన చుట్టూ జరుగుతున్న సంఘటనల్లోనే అనేక ప్లాట్స్ వెతుక్కోవచ్చని తెలియని ది గ్రేట్ రైటర్.


(రంజని లో 1975---82 మధ్య ప్రచురించబడింది)

0 comments

Saturday, February 14, 2009

అన్నమయ్య సాహిత్యం - మానవతా దృక్పధం

Saturday, February 14, 2009
సభలో ప్రసంగిస్తున్న జ్యోతిర్మయి




అన్నమయ్య సాహిత్యం – మానవతా దృక్పధం

పద కవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్య 60వ జయంతి సందర్భంగా అన్నమయ్య సాహిత్యం – మానవతా దృక్పధం అన్న విషయంపై ప్రముఖ సంకీర్తన గాయని, సామాజిక సేవకురాలు కొండవీటి జ్యోతిర్మయి ప్రసంగం 13-2-2009 తేదీన ఎ.జీ. ఆఫీసు ఆరుబయలు రంగస్ధలంలో రంజని సంస్ధచే ఏర్పాటు చేయబడింది. ఈ సభకు ప్రిన్సపల్ ఎకౌంటెంట్ జనరల్ శ్రీ జి.ఎన్. సుందర రాజా అద్యక్షత వహించారు.

ఆద్యంతం మృదు మధురంగా, మధ్యలో అన్నమాచార్య పదాలను వినిపిస్తూ సాగిన ఈ ప్రసంగంలో అన్ని వందల సంవత్సరాలకు పూర్వమే, సనాతన సాంప్రదాయాలు బలంగా వేళ్ళూనుకుని వున్న ఆ సంఘంలో అన్నమయ్య మానతావాదాన్ని ఎంత చక్కగా తన పదాల ద్వారా ప్రచారం చేశారో గాయని జ్యోతిర్మయి గారు విశదీకరించారు.

అన్నమయ్య రాగి రేకులమీద వ్రాసిన 32 వేల సంకీర్తనలలో దురదృష్టవశాత్తు మనకి ఇప్పుడు 12 వేల సంకీర్తనలు మాత్రమే లభిస్తున్నాయి అన్నారు. ఆయన వ్రాసిన పదాలు కొన్ని సరిగా అర్ధం చేసుకోని కారణంగా శృంగార గీతాలనుకుంటున్నారు అంటూ జగడపు తనవుల జాతర ని ప్రస్తావించారు. పూర్వం రైతులు ఏ గింజలు ఎన్ని రోజుల్లో మొలకలెత్తుతాయో తెలుసుకుని ఆ ప్రకారం పంటలు పండించటానికి పిడతలలో అన్ని రకాల ధాన్యాలూ పోసి మొలకలొచ్చేదాకా వాటి సంరక్షణ భారం ఇంట్లోని ఆడపిల్లలకు అప్పచెప్పేవారు. అమ్మాయిలు రోజూ ఆ పిడతలు మధ్యలో పెట్టుకుని చుట్టూ తిరుగుతూ ఆడేవాళ్ళు, పాడేవాళ్ళు. ఆ ఆట పాటల్లోంచి పుట్టిన పాట ఇదన్నారు.

స్తీ వాదం అంటేనే తెలియని ఆ రోజుల్లోనే అన్నమయ్య ఆడది రాజ్యమేలితే అది మంచిదేకాదా అనే పాట ద్వారా స్త్రీలని ప్రోత్సహించాడన్నారు. అరయనాపన్నునికి అభయమీవలెగాక ఇలపైన సుఖిని కావనేల అని భగవంతుని నిలదీసి పక్కా సామాజికవాదినని నిరూపించుకున్నారు. అంతేకాదు, రైతు మిత్రుడు అన్నమయ్య. చీమకానీ దోమకానీ అనే పాటలో పొలం పుట్రాలో అనేక విష జంతువులనెదుర్కొనే రైతులు ఆ వెంకటేశ్వరస్వామినే అండా దండాగా ఎలా తలుస్తారో పేర్కొన్నాడు. అలాగే తనకి బట్టలు ఉచితంగా ఇచ్చే నేత వాళ్ళ గురించి .... పంచభూతములనెడి సరిగంచు నూలు..అంటూ జగన్నాయకుని లీలా విలాసాలతో నేతగాళ్ళ నేతని పోలుస్తూ పదాలల్లారు.

అంతేకాదు. అన్నమయ్య ఆ రోజుల్లోనే పక్కా ఎకనమిస్ట్ అని నిరూపిచకున్నాడనటానికి ఉదాహరణ ఆయన కట్టిన ఈ పాట....రూకలై మాడలై రువ్వలై తిరిగేను... దాకొని వున్నచోట తానుండదదివో...ఒకరి రాజుగ చేసు ఒకరి బంటుగ చేసు.....

వాక్కుని గేయాన్ని మిళితం చేసిన వాగ్గేయకారుడు అన్నమయ్య తన రచనలకు పదాలనెంచుకోవటానికి కారణం సామాన్యజనులకు అర్దమవటానికి. మన జీవిత విధానం ఎలా వుండాలో అందంగా చెప్పిన అన్నమయ్యను స్పిరిట్యుయల్ కమ్యూనిస్టుగాఅభివర్ణిచారు వక్త.

అన్నమయ్యకు పూర్వం కర్ణాటకలో బసవేశ్వరుడు కన్నడంలో పదాలు పాడాడుట. తెలుగులో కృష్ణమాచార్యులు తొలి పద కవితా రచయిత అయినా ఆయన రచనలు వచనంలో వుండేవి. అవి కూడా ఇప్పుడు దొరకటంలేదు. కేవలం ఆయన గురించి అన్నమయ్య వంశీకులు వ్రాసిన విశే్షాల వల్లే ఈ సంగతి తెలిసిందన్నారు.

అంతేకాదు. అన్నమయ్య పదాల్లో వచ్చే అన్నమయ్య అనే మాటని ఆయన వాడలేదు. ఆయన కుమారుడు పెద్ద తిరుమలాచార్యులు, మనవడు చిన్న తిరుమలాచార్యులు ఆ గీతాలు అక్కడదాకా అన్నమయ్య రచన అని తెలియజెయ్యటానికి ఆ పేరు చేర్చారన్నారు.

సాక్షాత్తూ గోవిందుని ప్రశంసలు అందుకున్న అన్నమయ్య చెడుని ఖండించి మానవతా దృక్పధాన్ని ప్రచారం చెయ్యటానికి అవతరించిన కారణ జన్ముడు. ఆయన బాటలో సంకీర్తన, సత్కర్మ నినాదంతో ముందుకు సాగి పోదామని ఉద్బోధించారు జ్యోతిర్మయి.

తదనంతరం రంజని సంస్ధ అద్యక్షులు, శ్రీ చీకోలు సుందరయ్య మాట్లాడుతూ అన్నమయ్య మహిళాభ్యుదయం గురించి మాటల్లోనే కాదు చేతల్లో కూడా చూపించారు, ఆయన భార్య తాళ్లపాక తిమ్మమ్మే దీనికి ఉదాహరణ. ఆవిడ మంచి కవయిత్రి. సుభద్రా పరిణయం అనే కావ్యం వ్రాశారు అని చెప్పారు.

వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.

0 comments

డా. డి. రామానాయుడు నాటక పరిషత్

శేషార్ధం నాటికలో ఒక దృశ్యం

సభలో డా. డి. రామానాయుడు, డా. సి. నారాయణ రెడ్డి, మొదలగువారు


డా. డి. రామానాయుడు నాటక పరిషత్

అభినయ, జాతీయ నాటక రంగ మాస పత్రిక, ఆధ్వర్యంలో డా. డి. రామానాయుడు నాటక పరిషత్, ప్రధమ రాష్ట్ర స్ధాయి ఆహ్వాన నాటిక పోటీలు ఫిబ్రవరి 13 2009 న డి. రామానాయుడు కళామండపం, ఫిల్మ్ నగర్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కాంప్లెక్స్, ఫిల్మ్ నగర్, హైదరాబాదులో ప్రారంభించబడ్డాయి.

ప్రముఖ రచయిత డా. సి. నారాయణ రెడ్డి సభను ప్రారంభిస్తూ, నాటకం సినిమాకి తల్లిలాంటిది. ఫిల్మ్ నగర్ లో సినీ కళాకారులు చాలామంది నివసిస్తున్నారు. ఇంతమంది సినీ కళాకారులున్న ఇక్కడ నాటకాలు వెయ్యటమంటే కొడుకు తల్లిని గుర్తుపెట్టుకోవటంలాంటిదన్నారు. డా.డి. రామానాయుడు జ్యోతి ప్రజ్లలన చేసిన తర్వాత ఉపన్యసిస్తూ సినిమాలవాళ్ళకి నాటకాలు చూసి కళాకారులను సినిమాలలోకి తీసుకోవటం అలవాటేనని, తను వాణిశ్రీగారిని చిల్లర కొట్టు చిట్టెమ్మ నాటకం చూసే సినిమాల్లో సెలెక్టు చేసుకున్నానన్నారు.

నాటక ప్రియులకు శుభవార్త
సభలో ఫిల్మ్ నగర్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సెక్రటరీ, శ్రీ కాజా సూర్య నారాయణ మాట్లాడుతూ ఇక్కడ ఎవరు ఎన్ని నాటకాలు వేసినా హాలు, కరెంటుతో సహా ఉచితంగా ఇస్తామని వాగ్దానం చేశారు. సభలో ఇంకా శ్రీయుతులు బలరామయ్య, I.A.S., సినీ డైరెక్టర్లు రాఘవ, పి. చంద్ర శేఖర రెడ్డి, గోరంట్ల రమేష్ పాల్గొన్నారు.

తదనంతరం కల్పన కళా నికేతన్, నర్సరావుపేట వారిచే శ్రీ నాగరాజు గంధం వ్రాసిన శేషార్ధం అనే నాటిక శ్రీ యస్.యం. బాషా దర్శకత్వంలో ప్రదర్శింపబడింది. భార్యా భర్తలు విడిపోయినా పరవాలేదుగానీ తల్లి దండ్రులు విడిపోకూడదు అనే సందేశాన్ని అందించిన ఈ నాటికలో నటీనటులు బాగా రాణించారు.

తరువాత స్యూ స్టార్స్ మోడరన్ ధియేటర్స్, విజయవాడ వారిచే శ్రీ ఎం.ఎస్. చౌదరి రచన, దర్శకత్వంలో అశ్రువులు అనే నాటిక, కళానికేతన్, వీరన్నపాలెం వారిచే నవ్వకండి అనే నాటిక శ్రీ కాటా సుబ్బారావు రచించగా వై.బి. చౌదరి దర్శకత్వంలో ప్రదర్శింపబడ్డాయి.

14-2-2099 శనివారం

సా. 6-00 గం. లకు ఇదే నా తీర్పు చైతన్య కళా స్రవంతి, విశాఖపట్నం వారిచే
రచన కాశీ విశ్వనాధ్ దర్శకత్వం పి. బాలాజీ నాయక్

7-20 గం. లకు ఆన్సర్ సాగరి, చిలకలూరిపేట వారిచే
రచనః భరతుల రామకృష్ణ దర్శకత్వం ఐ. రాజ్ కుమార్

8-40 గం. లకు తెలుగు దొంగలు సవ్యసాచి కల్చరల్ అసోసియేషన్, హైదరాబాదు వారిచే
రచన, దర్శకత్వంః సమ్మెట గాంధీ


15-2-2009 ఆదివారం

సా. 6-00 గం. లకు జ్వాలా కుసుమం కళావాణి, ఉభయ గోదావరులు వారిచే
రచనః వై. సాయిబాబా, దర్శకత్వంః ఎం. ప్రసాదమూర్తి

7-20 గం. లకు తలుపు విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్, హైదరాబాదు
రచన ఆకెళ్ళ, దర్శకత్వం బి.యం. రెడ్డి

8-30 గం. లక బహుమతి ప్రదానోత్సవం అందరూ ఆహ్వానితులే

ఈ కార్యక్రమంలో అనేకమంది సినీ కళాకారులు పాల్గొంటారు.

0 comments