Tuesday, December 22, 2009

భర్త పోయిన స్త్ర్రీని పదోరోజునే చూడాలా?

Tuesday, December 22, 2009




కొన్ని కుటుంబాలలో సాంప్రదాయం పేర భర్త పోయిన  మహిళని పదో రోజున చిత్రహింసలకి గురిచేసి మానసికంగా నానా  క్షోభ పెడుతున్నారు.  కాలం తీరి జీవిత సహచరుడు పోవటమే స్త్రీకి జీవితంలో పెద్ద శిక్ష.  ఇంకా ఆచారాల పేరిట పదో రోజు ఆవిడ సౌభాగ్య చిహ్నాలు బలవంతంగా తీసేసి, తెల్లచీర కట్టించి ఆవిడని ఒక మూల కూర్చోపెట్టి అందరూ చూడాలంటే ....ఒక స్త్రీని అంత క్షోభ పెట్టే అధికారం ఎవరికీ లేదు.  ఇలాంటివసలు ఏ శాస్త్రంలోనూ లేవంటున్నారు.

కరీంనగర్ జిల్లాలో మంధని అనే ఊరుంది.  ఇదివరకు ఈ ఊరు పేరు మంత్రపురి.  అక్కడ చతుర్వేదాలు చదివిన బ్రాహ్మలు వుండేవారు.  వారెవరూ ఈ ఆచారాలు పాటించలేదుట.  ఇప్పటికీ అక్కడివారెవరూ, బ్రాహ్మలు కూడా ఈ ఆచారాలని నిర్బంధంగా పాటించరు.

అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్వి పుష్కరయోగం అనేది వున్నది.  ఆ సమయంలో ఏపనయినా చేస్తే మళ్ళీ మళ్ళీ చేయవలసి వస్తుందిట.  అలాంటి వ్యక్తిని ఆ యోగ సమయంలో చూస్తే మళ్లీ ఇంకెవర్నయినా  అలా చూడాల్సివస్తుందేమో, దాన్ని ఆపాలనే చిన్న కారణంతోనే.......అంతేకానీ ఇది శాస్త్రబధ్ధంకాదు.  ఎవరూ పాటించక్కరలేదు. 

అలాంటి స్త్రీని పదో రోజే, అలా కూర్చోబెట్టే చూడక్కరలేదు.  ఏ అనుమానాలూ లేకుండా వుండటానికి ఏదో ఒక మంచి రోజున  వెళ్ళి పలకరించి వస్తే సరిపోతుంది.  ఆవిడ  ఆవిడ పనులు చేసుకుంటున్నప్పుడు మామూలుగా వెళ్ళి మాట్లాడి రావచ్చు.  ఆప్పుడు ఆవిడ కూడా ఈ ఆచారాలవల్ల బాధపడదు. 

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)

మనలోమాట

పిల్లలు పుట్టినప్పుడు 11వ రోజు పురిటి స్నానం కాగానే బొట్టు పెట్టటం మొదలు పెడతారు. ఆడ పిల్లలకి చిన్న పిల్లలకి కూడా కుంకుమ బొట్టు పెడతారు, పసుపు రాస్తారు, పూలు పెడతారు.  అవి పెళ్ళితో రాలేదుకదా.  మరి వీటన్నింటినీ భర్త పోగానే ఎందుకు తీసెయ్యాలి. 

3 comments

Saturday, December 19, 2009

సముద్ర స్నానం ఎప్పుడు చెయ్యాలి?

Saturday, December 19, 2009
సముద్ర స్నానం ఎప్పుడు చెయ్యాలి?

మన పెద్దలు సముద్ర స్నానానికి కూడా కొన్ని నియమాలు చెప్పారు.  ఈ నియమాలెందుకో తెలుసా?  మన ఆరోగ్యం గురించే.  కాలమాన పరిస్ధితులనుబట్టి సంవత్సరంలో నాలుగు మాసాలు సముద్ర స్నానానికి శ్రేష్టమయినవి అంటారు.  అవే ఆ కా మా వై.  ఈ భాషేమిటంటారా?   ఆషాఢమాసం, కార్తీక మాసం, మాఘ మాసం, వైశాఖ మాసం.  ఈ నెలలే ఎందుకంటారా? 

ఈ నెలలలో ఋతువులు మారటం వల్ల వాతావరణంలో మార్పులొస్తాయి.  ఎండాకాలంనుంచి వర్షాకాలంలోకి అడుగు పెడతాము ఆషాఢమాసంలో.  కార్తీక మాసం వర్షాకాలానికీ చలికాలానికీ మధ్య వారధి.  మాఘ మాసం చలికాలానికీ ఎండాకాలానికీ సంధి సమయం.  వైశాఖమాసం తీవ్ర ఎండలుకాసే మాసం.  వీటిని సంవత్సరంలో కోణాలంటారు.  ఈ నాలుగు నెలలలో ఋతువుల్లో వచ్చే మార్పులను శరీరం తట్టుకోలేదు.  పౌర్ణమి రోజు సముద్రంలో ఆటుపోట్లు ఎక్కువ వున్నట్లే మానవ శరీరంలో ఉద్వేగాలు ఎక్కువగా వుంటాయి.  ఈ మార్పులు తట్టుకోవటానికే ఈ నెలలలో సముద్ర స్నానం చేస్తే మంచిదంటారు.  అందులోనూ పౌర్ణమినాడు ఇంకా మంచిది అంటారు.  శరీరంలో కలిగే ఉద్వేగాలు సముద్రపు ఆటుపోట్లతో సర్దుకంటాయి.

సముద్ర స్నానం చేసేటప్పుడు తల మొత్తం మునిగేలాగా మునకవేయాలి.  సముద్రంలోని ఉప్పునీటివలన స్వేద గ్రంధులన్నీ శుభ్ర పడతాయి.  శరీరంలో ఎక్కడయినా చిన్న చిన్న గాయాలువున్నా ఈ ఉప్పునీటికి మానుతాయి.  సముద్ర అలలతో ఆడుకోవటంలో ఉల్లాసం, ఉత్సాహం ఎలాగూ వుంటుంది. 

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)

0 comments

Friday, December 18, 2009

సాలగ్రామాన్ని ఇంట్లో వుంచి పూజించవచ్చా?

Friday, December 18, 2009




సాలగ్రామాల్లో అనేక రకాలు వున్నాయి. ఆదిత్య, నారసింహ, శివ, విష్ణు, వగైరా. ఇవి ఎక్కడపడితే అక్కడ దొరకవు. కేవలం గండకీ నదిలో మాత్రమే దొరుకుతాయి. నునుపుదేలిన రాయి కోణంతో వుంటుంది. ఇవి మంచివికానివి ఇంట్లోవుంటే అరిష్టం. విరిగినవి, ఉబ్బెత్తుగా వున్నవి మంచివికావు.






సాలగ్రామాలు ఇంట్లో తరతరాలుగా వుంటే తప్పకుండా పూజించాలి. యాగాలు, హోమాలు చేయటంకన్నా సాలగ్రామ పూజ విశేష ఫలితాలనిస్తుంది. ఇంటికి మంచిది. మనం తెచ్చుకున్నా జీవితాంతం క్రమం తప్పకుండా పూజించాలి. ఇంటికి రక్షణ కవచంలాగా వుంటుంది, సకల దోషాలనీ పోగొడుతుందని పెద్దలు చెప్తారు.






(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)



0 comments

మంగళవారంనాడు భూమి తవ్వకూడదా?

మంగళవారంనాడు భూమి తవ్వకూడదా?

నిజమే తవ్వకూడదు.  మరి కారణాలు....మంగళవారానికి అధిపతి అయిన కుజుడు భూమి పుత్రుడు.  ఈయన్నే మంగళుడు, అంగారకుడు అని కూడా అంటారు.  భూమిని తవ్వటానికి ఉపయోగించే గునపాలు వగైరా వాటికి అధిపతి కుజుడు.  ఆయన తన సంకేతాలు అయిన గడ్డపారలు వగైరాలతో తన తల్లి అయిన భూమిని గాయపరుస్తుంటే  సహించలేడుకదా.  ఏ కొడుకైనా తన తల్లిని బాధ పెట్టాలని అనుకోడుకదా.  అందుకే మంగళవారం నాడు భూమి తవ్వకూడదు అన్నారు పెద్దలు.

ఈ పెద్దవాళ్ళింతే ఏవో చెప్పి అందర్నీ పాటించమంటారు అంటారా?  వుండండి.  మీలాంటి వాళ్ళకోసం జ్యోతిష్య శాస్త్రం ఏమంటోందో కూడా చూద్దాము.  కుజుడు అగ్ని తత్వం కలవాడు.  (కుజ కారకం అగ్ని తత్వం కలది).  మనం భూమి ఎందుకు తవ్వుతాం?  మొక్కలు నాటటానికో, పంట వెయ్యటానికో, బావి లేక బోరింగు కోసమో, ఇల్లు కట్టటానికో ఇలాంటి పనులకేకదా.  అంటే మొక్కలకీ, చేలకీ, పంటలకీ, అన్నింటికీ నీటి అవసరముంది.  వాటికి నీరు సమృధ్ధిగా వుండాలి.  ఆ పొలాలు, మొక్కలూ పచ్చగా వుండి సమృధ్ధిగా దిగుబడి ఇవ్వాలి.  బావికానీ, బోరింగుకానీ నీళ్ళకోసమే వేస్తాము.  మరి ఇల్లు కట్టేటప్పుడు అంటే, ఆ ఇంటికి అగ్ని ప్రమాదాలు  వుండకూడదు.   అందుకే, అగ్ని తత్వంకల కుజుడు అధిపతి అయిన మంగళవారం నాడు భూమి తవ్వకూడదు అంటారు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)

2 comments

Thursday, December 17, 2009

సంతానంలేనివారు సీమంతానికూ నామకరణానికీ వెళ్ళకూడదా?

Thursday, December 17, 2009





ఇది చాలా చెడు సాంప్రదాయం.  కొన్ని ప్రాంతాల్లో బిడ్డనీ, గుండ్రాయినూ వుయ్యాల చుట్టూ మూడనసార్లు తిప్పి బిడ్డని తల్లికి, గుండ్రాయిని పిల్లలు లేని ఆవిడకీ ఇస్తారు.  ఇది మరీ అన్యాయం.  ఎదుటివారిని అవమానించటమే.  

యా దేవీ సర్వ భూతేషు మాతృ రూపేణ సంస్ధితా
నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమః

అని దేవికి నమస్కరిస్తాము.  ఆ పరదేవత సర్వ ప్రాణుల్లోనూ మాతృ తత్వం రూపంలో వున్నది. అవును.  సర్వ ప్రాణుల్లో, పశు పక్షులలో, జంతువుల్లో, పురుషుల్లోకూడా  మాతృ తత్వం వుంటుంది.  తోటి ప్రాణిని  ప్రేమతో అక్కున చేర్చుకునే  ప్రతి మనిషికీ మాతృ తత్వం వుంటుంది.  వారు పిల్లల్ని కనకపోయినా మాతృమూర్తులే.    కొందరు అనాధ పిల్లల్ని పెంచటానికి తమకి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుని మరీ అనాధ పిల్లల్ని పోషిస్తున్నవాళ్ళున్నారు.

మాతృ తత్వం మనసులో వుండాలికానీ శరీరానికి కాదు.  పిల్లలు లేక పోవటం కేవలం శారీరక లోపమే.  మనం మనిషిలోని తత్వాన్ని గౌరవించాలి.  మానసికంగా మాతృభావం కలవారంతా మాతృమూర్తులే.  వారిని ఆదరించాలి, గౌరవించాలి.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)


3 comments

Friday, December 11, 2009

పంచ మహా యజ్ఞాలంటే ఏమిటి?

Friday, December 11, 2009

పంచ మహా యజ్ఞాలంటే ఏమిటి?

ఇవి ఋత్విక్కులు చేసే యజ్ఞాలు కాదండీ.   శాస్త్ర ప్రకారం ప్రతి వ్యక్తీ అను నిత్యం పాటించ వలసిన విధులు.  అవి ఏమిటి?

1. దేవ యజ్ఞం
పూర్వం నిత్యాగ్నిహోత్రులు వుండేవారు.  వారు తాము భోజనం చేసే ముందు కొంచెం అన్నాన్ని అగ్నికి ఆహుతి చేసేవారు.   దీనికి ఆహుతం అని పేరు.  అలాకాక ఇంట్లో వారందరూ అగ్నికి సమిధలు సమర్పించినా ఆహుతం చేసినట్లే.  సృష్టికి మూల కారకుడైన దేవదేవుని నిత్యం తలుచుకుని ఆయనకు కృతజ్ఞతలు తెలపటమే దీని ముఖ్యోద్దేశ్యం.

2. పితృ యజ్ఞం
మనల్ని కని పెంచి ఇంత వారిని చేసిన తల్లితండ్రలను ప్రేమగా చూడాలి.  చిన్నప్పుడు వారు మనల్ని ఎంత ప్రేమగా చూశారో, మన అవసరాలెలా తీర్చారో, అలాగే వారి పెద్ద వయసులో వారిని కనిపెట్టుకుని వుండాలి.  ఇలా వారి ఋణాన్ని కొంతయినా తీర్చుకోగలం.  ఇది పితృ యజ్ఞం.

3. భూత యజ్ఞం
గృహస్తు సర్వప్రాణికోటిమీద  దయ కలిగి పుండాలి.  పశు పక్షులు, క్రిమి కీటకాదులు మానవుడి మీద ఆధార పడి వున్నాయి.  అందుకే మనిషికి భూత దయ వుండాలి.  అన్నం తినే ముందు ఒక ముద్ద అన్నం పక్షుల కోసం బయట (పక్షులు వచ్చే ప్రదేశంలోపెట్టాలి.  ఇంటి ముందు కుక్కకి, ఇంట్లో పిల్లికి అన్నం పెట్టాలి.  ఇంట్లో పశువులు వుంటే వాటికి పెట్టాలి.  క్రిమి కీటకాల కోసం కొంచెం అన్నం (తినక ముందు)  పక్కన పెట్టాలి.  (మన పెద్దలు వీటిని పాటించటం మీలో కొందరయినా చూసే వుంటారు).  జలాశయాలలో జలచరాలకు కూడా ఆహారం వెయ్యాలి.  సర్వ ప్రాణులయందూ దయ కలిగి వుండి ప్రతి నిత్యం కనీసం ఏదో ఒక దానికన్నా ఆహారం ఇవ్వాలి.

4. మనుష్య యజ్ఞం

మన పెద్దలు అతిధి దేవో భవ అన్నారు.  అప్పటివారు ఆతిధ్యం కోరి వచ్చినవారు తమకు తెలియనివారయినా వారిని ఆదరించి సత్కరించేవారు.  రోజులు మారినాయి.  అయినా ఇంటికొచ్చినవారిని మన కులం వారా, మన మతం వారా మన కేవిషయంలో నైనా పనికి వస్తారా లేదా వగైరాలాలోచించకుండా వారు వచ్చిన సమయాన్నిబట్టి తగు విధంగా గౌరవించాలి.  తోటి వారి పట్ల దయ కలిగి వుండాలి.  అందరితో సఖ్యంగా వుండాలి.  ఎవరైనా సహాయం కోరితే, మనం చెయ్యగలిగితే నిస్వార్ధంగా చెయ్యాలి.

5. బ్రహ్మ యజ్ఞం
ప్రతి వారూ, ప్రతి రోజూ వేద మంత్రాలు కానీ శాస్త్రిలని కానీ చదవాలి.  ఇప్పుడు వేద మంత్రాలు చదివే వారి సంఖ్య తక్కువగానీ ప్రతి వారూ ఎవరికి వీలయిన, ఎవరికి ఆసక్తి వున్న, ఎవరికి అనుకూలంగా వున్న శాస్త్రాలను చదవాలి.  ప్రతి రోజూ కొత్త విషయాలను తెలుసుకునే ఆసక్తి చూపించాలి.  అంతేకాదు. తను తెలుసుకున్నది ఇతరులకు చెప్పాలి. 

ప్రతి మనిషికీ భగవంతుని పట్ల విశ్వాసం, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, భూత దయ, తోటి మనిషులతో కలిసి వుండే మనస్తత్వం, శాస్త్రం తెలుసుకుని నలుగురితో పంచుకునే జిజ్ఞాస వున్నాయనుకోండి.  ఈ ప్రపంచం ఎలా వుంటుందో ఒక్కసారి ఊహించుకోండి.  మనిషిని సక్రమ మార్గంలో నడపటానికే ఈ పంచ యజ్ఞాలను నిర్దేసించారు మన పెద్దలు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)

మనలో మాట
మా నాన్నగారు, శ్రీ పులిగడ్డ జనార్దనరావుగారు నిత్యాగ్నిహోత్రం తప్ప మిగతావి పాటించటం చూశాం మేము.  అలాగే మీలో చాలామంది చూసి వుండవచ్చు.   రోజులు మారటంతో, మన హడావిళ్ళల్లో  వీటిలో కొన్నయినా మనకి తెలిసినా, అనేక కారణాల వల్ల పట్టించుకోవటంలేదు.  ఇది విన్నప్పుడు నాకనిపించింది.  పూర్వంకన్నా వీటి అవసరం ఇప్పుడే ఎక్కువ వున్నదని.  ఇది చదివాక మీకూ అనిపిస్తే అన్నీ, అన్ని సార్లూ చెయ్యకపోయినా మీ అనుకూలతనుబట్టి  కుదిరినప్పుడన్నా చెయ్యండి. 



0 comments

Thursday, December 10, 2009

సంధ్యా సమయంలో చేయకూడని పనులు ఏమిటి?

Thursday, December 10, 2009
సంధ్యా సమయంలో చేయకూడని పనులు ఏమిటి?

మనకి సంధ్యా సమయాలు మూడు.  ప్రాత సంధ్య, మధ్యాహ్న సంధ్య (సూర్యుడు నడి నెత్తిన వున్నప్పుడు), సాయం సంధ్య.  ఈ సంధ్యా సమయాల్లో కొన్ని పనులు చెయ్యకూడదని పెద్దలు చెబుతారు.  ఆ సమయంలో నిద్రిస్తే మహలక్ష్మి వెళ్ళిపోతుంది, ఆ ఇంట దరిద్రం తాండవిస్తుంది అంటారు.  ఆ సమయాల్లో ఏమీ ఆహారం తీసుకోకూడదు.  దానివల్ల రోగాలు వస్తాయి.  విద్యార్ధులు చదవకూడదు.  మేధస్సు తగ్గుతుందంటారు.  స్త్రీ పురుష సంగమం నిషిధ్ధం.  ఆ సంగమం వల్ల పుట్టే బిడ్డలు దుష్ప్రవర్తన కలవారు,  రోగిష్టులూ అవుతారు.  గర్భిణీ స్త్రీలకు కూడా అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. 

ఇంకొక విషయం.  ఈ సంధ్యా సమయాల్లో చేసే పనులేవీ సక్రమంగా సాగవు.  మంచి ఫలితాల్నివ్వవు.  అందుకే మంచి ఫలితాల్ని ఆశించి చేసే పనులేవీ సంధ్యా సమయాల్లో చెయ్య కూడదు.

సాయం సంధ్యా సమయంలో పరమ శివుడు పార్వతీ దేవి ముందు పరవశించి నాట్యం చేస్తాడుట.  దేవతలందరూ అక్కడే వుంటారుట.  అందుకే సూర్యాస్తమయానికి ముందు దీపారాధన చేసి భగవంతుని ప్రార్ధించటం మంచిది.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)

మనలో మన మాట

ఈ కాలంలో సూర్యాస్తమయానికి ముందు దీపారాధన చెయ్యటం ఎంతమందికి కుదురుతుందండీ  కుదిరిన వాళ్ళు చెయ్యండి.  కుదరని వాళ్ళు అయ్యో చెయ్యలేక పోయామే అని బాధ పడద్దు.  ఆ సమయంలో చెయ్యకూడని పనులు వున్నాయికదండీ.  అవ్వి చెయ్యకుండా వుండండి.  చాలు.  మరి ఆ సమయంలో కూడా పిల్లల్ని చదువులంటూ రుద్దేస్తే ఎలాగండీ.  హాయిగా కాసేవు ఆడుకోనివ్వండి.  వాళ్ళలా ఆడుకోవాలనే  ఆ సమయంలో చదివితే మేధస్సు తగ్గుతుందని పెట్టారు.  నిజమే కదండీ.  వాళ్ల మనసు ఆటల మీద వుంటే పుస్తకం ముందు మనిషి వుండి లాభమేమిటి



0 comments

Wednesday, December 9, 2009

మంగళ, శుక్రవారాలలో డబ్బు ఎవరికీ ఇవ్వకూడదంటారు. నిజమేనా?

Wednesday, December 9, 2009


కొందరు మంగళవారం, శుక్రవారం ఎవరికీ డబ్బు ఇవ్వరు, కొందరు బూజులు కూడా దులపరు, కొందరు పుట్టింటినుంచి ఆడపిల్లని పంపరు.  ఆడపిల్లని ఇంటి లక్ష్మీ దేవిగా భావిస్తారు.  అందుకే లక్ష్మీదేవి వారాలుగా  పూజ చేసే ఆ రెండు రోజులూ డబ్బులివ్వటంగానీ, అమ్మాయిని పంపటంగానీ చెయ్యరు.  తమ ఇంటి సిరి సంపదలు పోతాయనే నమ్మకంతో.  మరి బూజులు దులపక పోవటానికి కూడా ఒక కధ చెప్తారు.  శ్రీ కాళ హస్తీశ్వరుని కధ అందరికీ తెలిసిందే కదా.  శ్రీ అంటే సాలె పురుగు, పాము, ఏనుగు  శివునికి పూజలు చేసి మెప్పిస్తాయి కదూ.  శ్రీ అంటే లక్ష్మి అని కూడా అర్ధం వుంది.  బూజులు, అంటే సాలె పురుగులు కట్టిన గూళ్ళు కదా వాటిని తీసి ఆ శ్రీలకి ఎందుకా రోజుల్లో అపచారం చెయ్యాలని బూజులు దులపరు.

ఇవి పాటించవలసిన విషయాలేనా?  ఇందులో ఎంత మటుకు నిజం వుంది?  బూజుల సంగతి వదిలేద్దాం.  ఎందుకంటే ఆ రెండు రోజులూ కాకపోతే వేరే రోజుల్లో దులుపుకోవచ్చు.  మరి డబ్బుల సంగతేమిటి  జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మంగళవారం డబ్బులు ఇవ్వటం మంచిది.  ఆ రోజుకి మళ్ళీ మళ్ళీ చేయించే గుణం వుందిట.  అందుకే బ్యాక్ ఎక్కౌంటు తెరిచి డబ్బు దాచుకోదలిచారా?  మంగళవారం నాడు చెయ్యండి.  ఆ ఎక్కౌంటు లో మళ్ళీ మళ్ళీ డబ్బు వేస్తూనే వుంటారు.  అలాగే ఎక్కువ అప్పు ఏమైనా వుండి కొద్ది కొద్దిగా తీరుద్దామనుకున్నారా?  మంగళవారం నాడు తీర్చండి.  తొందరలోనే మళ్ళీ మళ్ళీ ఆ అప్పు తీర్చగలుగుతారు, త్వరలో ఋణ విముక్తులవుతారు.

ఫ్రాంతాలవారీగా కూడా ఈ నమ్మకాలు మారుతూ వుంటాయి.  కొందరు మంగళ, శుక్రవారాలు పాటించినట్లు నిజామాబాదు వైపు కొందరు బుధవారం నాడు, విశాఖ పట్టణం వారు గురువారం నాడు డబ్బు ఇవ్వరు.  అంటే వారు ఆ రోజుల్లో లక్ష్మీ పూజ చేస్తారు.  అలాగే కొన్ని గ్రామీణ బ్యాంకులు బుధవారం నాడు పని చెయ్యవు.  ఎవరి నమ్మకాలూ, ఆచారాలూ వారివి.

అయితే మనకి వారాల పట్టింపు వుందని  ఏ పని మనిషో నెలంతా పని చేసి ఆ రోజుల్లో డబ్బులడిగితే ఇవ్వటం మానెయ్యకూడదు.  ఎందుకంటే అది వారి డబ్బు.  వారు పని చెయ్యటం వల్ల సంపాదిచుకున్న డబ్బు.  మనం వారికి బాకీ వున్నాము.  దానికి వార వర్జ్యాలు చూడకుండా ఇచ్చెయ్యాలి. 

ఏ రోజైనా ఉదయ, సాయం సంధ్యా సమయాలలోనూ, పూజ చెయ్యగానేనూ సంపదని ఇంటినుంచి పంపకూడదు.  అంటే మనమేదైనా కొనుక్కోవటానికి మూల ధనాన్ని ఖర్చు చెయ్యకూడదు.  కానీ కష్టపడ్డవారికి డబ్బు ఇవ్వటానికి సంశయించ కూడదు.  అందుకే ఏదీ గుడ్డిగా నమ్మక  సమయానుకూలంగా, డబ్బుని ఎప్పుడు ఏ సమయంలో దేనికి వినియోగించాలో అలా వినియోగించాలి.  ఆ ఆలోచన వుంటే ఆర్ధిక ఇబ్బందులే వుండవుకదా.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా) 



3 comments

Tuesday, December 8, 2009

స్నానం చెయ్యకుండా పూజ చెయ్యవచ్చా?

Tuesday, December 8, 2009


ఇదేం ప్రశ్న?  ఎవరైనా అసలు స్నానం చెయ్యకుండా పూజ చేస్తారా?  చెయ్యకూడదు కదా!?   నిజమేనండీ.  చెయ్యకూడదు.  మన దినచర్య అంతా సజావుగా సాగిపోతున్నప్పుడు మన మనసూ, శరీరం పరిశుభ్రంగా వున్నప్పుడే పూజ చెయ్యాలి.

కానీ కొన్ని సందర్భాలలో రోజూ స్నానం చెయ్యలేక పోవచ్చు.  దూర ప్రయాణాలలోకానీ, జబ్బుచెయ్యటవల్లకానీ, ఏదైనా ఆపరేషన్ అయినప్పుడుకానీ,  వృధ్ధాప్యంలో మంచం మీద నుంచి కదలలేక కానీ స్నానం చేసే పరిస్ధితుల్లో వుండక పోవచ్చు.  అలాంటప్పుడు పూజ మానేయాలా?  అక్కరలేదు.  ఒకసారి మనం భక్తి మార్గాన పడ్డాక ఆ మార్గాన్ని వదలకూడదు.  అప్పటిదాకా మనం చేసుకునే వూజ, పారాయణ వగైరాలన్నీ అలాంటి సందర్భాలలోకూడా మానకుండా చేసుకోవచ్చు.  ఎలాగంటారా?

మానసిక పూజనికూడా భగవంతుడు స్వీకరిస్తాడండీ.  వీలయితే తడిగుడ్డతో ఒళ్ళు తుడుచుకుని బట్టలు మార్చుకుని, మగవారయితే భస్మాన్ని ధరించి, ఆడవారయితే పసుపు నీరు పైన చిలకరించుకుని, మానసిక పూజ చేసుకోవచ్చు. 

అయితే ఇలాంటప్పుడు బాహ్యంగా చేసే పూజలు, దీపారాధన, అభిషేకాలు, గుళ్ళోకెళ్ళటం వగైరాలు చెయ్యకూడదు.  కానీ మనసులో దీపారాధన చెయ్యవచ్చు, పూజలూ, అభిషేకాలూ, చేసుకోవచ్చు, నైవేద్యాలు పెట్టవచ్చు.  అన్ని మానసికంగా చెయ్యవచ్చు.  వృధ్ధాప్యంలో బాహ్యంగా పూజలు చేసే శక్తి  లేక పోవచ్చు.  వారు అలవాటయిన తమ పూజా విధానాన్ని మానసికంగా చేసి తృప్తి చెందవచ్చు.  మనం ఎక్కడ వున్నా, ఏ పరిస్ధితుల్లో వున్నా, మానసికంగా భగవన్నామ స్మరణ చేసుకోవచ్చు.  ఏ వయసు, ఏ మతం, ఏవర్గం వారికైనా మానసిక పూజ చెయ్యటానికి స్నానంతో సంబంధం లేదు.

మామూలుగా ఉదయం నిద్ర లేవగానే ఆరోగ్యవంతులు కూడా పక్కమీదనుంచి  దిగే ముందు మానసికంగా దైవస్మరణ చేశాకే  దిగాలి.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా) 




0 comments

తీర్ధం ఎన్నిసార్లు, ఎలా తీసుకోవాలి?





దేవునికి అభిషేకం చేసిన జలాన్ని పాదోదకం అనీ, జపం చేసినప్పుడు ఉధ్ధరిణతో పక్కన వేసిన జలాన్ని మంత్ర జలమనీ,  తీర్ధంగా తీసుకుంటాము.  అయితే తీర్ధాన్ని ఎలా తీసుకోవాలి? ఎన్ని సార్లు తీసుకోవాలి?

తీర్ధం తీసుకునేటప్పుడు కుడి చేతి చూపుడు వేలు, బొటన వేలు కలిపి అరచెయ్యి గుంటలాగా చేసి ఆ చేతి కింద వస్త్రం ఏదైనా పట్టుకుని తీసుకోవాలి.  గుళ్ళో తీర్ధం తీసుకుంటున్నట్లయితే నుంచుని తీసుకోవాలి, అదే ఇంట్లో అయితే కూర్చుని తీర్ధం తీసుకోవాలి.

తీర్ధాన్ని  అకాల మృత్యు హరణం, సర్వ వ్యాధి నివారణం, సర్వపాప క్షయకరం,  ___________         పాదోదకం పావనం శుభం (డాష్ వున్న చోట మనం ఏ దేవుని పూజా తీర్ధం సేవిస్తున్నామో ఆ దేవుని పేరు చెప్పుకోవాలి)  అని చెబుతూ మూడుసార్లు తీసుకోవాలి.  మంత్రంలో వున్నట్లే భగవంతుని పాదోదకమైన ఆ తీర్ధం మొదటిసారి అకాల మృత్యువు లేకుండా చేస్తుందనీ, రెండవసారి సకల రోగాలనూ నివారిస్తుందనీ, మూడవసారి సకల పాపాలనూ నశింప చేస్తుందనీ నమ్మకంతో తీసుకోవాలి.  అలాగే మొదటిసారి తీసుకునే తీర్ధం శారీరిక, మానసిక శుధ్ధి కోసం, రెండవసారి తీసుకునేది న్యాయ, ధర్మ ప్రవర్తనకు, మూడవది మోక్షానికి అనే నమ్మకంతో తీసుకోవాలి.  శ్రీ విద్యా ఉపాసకులు నాలుగు సార్లు తీసుకుంటారు.  అయితే అది అందరికీ వర్తించదు.

ఇంకో విషయం....ఉపవాసం వున్న రోజు ఒక సారే తీర్ధం తీసుకోవాలట.  మూడు సార్లు తీసుకుంటే భోజనం చేసినంత శక్తిని భగవంతుడిస్తాడు అంటారు.

చాలామంది తీర్ధం తీసుకున్న తర్వాత ఆ చేతిని తలకి రాసుకుంటారు.  అలా రాసుకోకూడదు.  ఎందుకంటే ఆ ప్రదేశంలో సహస్రార చక్రం వుంటుంది.  పైగా సప్త ఋషి మండల స్ధానం కూడా.  అందుకే ఎంగిలి చేత్తో తలమీద రాసుకోకూడదు.  లౌకికంగా ఆలోచిస్తే తీర్ధంలో వుండే చక్కెర, పాలు, సుగంధ ద్రవ్యాలకు చీమలు, పురుగులు ఆకర్షింపబడతాయి.  అప్పుడు ఇబ్బంది మనకే.

తీర్ధం తీసుకున్న తర్వాత చెయ్యి కడుక్కోగూడదు అని కొందరంటారు   అది నిజం కాదు.  తీర్ధం తీసుకున్న తర్వాత తప్పనిసరిగా చెయ్యి కడుక్కోవాలి.  ఎందుకంటే తీర్ధం పరమ పవిత్రమైన మంత్ర జలం.  ఆ తీర్ధం తీసుకున్న చేత్తో ఎక్కడ పడితే అక్కడ ముట్టుకుని ఆ చేతికంటిన తీర్ధాన్ని అపవిత్రం చెయ్యకూడదు.

తీర్ధంలో పంచామృతాలు, తులసి దళాలు, సుగంధ ద్రవ్యాలు, మంత్ర శక్తి వుటాయి.  అందుకే తీర్ధం తీసుకునేటప్పుడు ఆరోగ్యకరమైన భావంతో, ఈ తీర్ధం నాకు మంచి చేస్తుంది, నా ఆరోగ్యాన్నీ, నా ఆధ్యాత్మికతనూ మెరుగు పరుస్తుందనే సద్భావంతో తీసుకోవాలి.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా) 





2 comments

Saturday, December 5, 2009

నిద్ర లేస్తూనే పక్క దిగేముందు భూవందనం చెయ్యాలంటారు. ఎందుకు?

Saturday, December 5, 2009

                                                                                                                                   

 మన సాంప్రదాయం ప్రకారం కన్నతల్లికి, భూదేవికి నిత్యం వందనం చెయ్యాలి.  వీళ్ళ ఋణం మనం తీర్చుకోలేనిది.  కన్నతల్లి 9 నెలలు ఆ తర్వాత నడక నేర్చి,  మన కాళ్లమీద మనం నిలబడేదాకా కొన్నేళ్ళు మనల్ని మోస్తే, భూదేవి మనల్ని మన జీవితాంతం మోస్తోంది.  మనం చచ్చేదాకా భూమి ఆధారంగా లేకుండా మన జీవితం వుందా?  ఒక్కసారి ఆలోచించండి.  మనకి ఇంత ఆధారమైన భూమిని మనం ఎంత హింసిస్తున్నాము.  తొక్కుతాము..  తవ్వుతాము ఇంకా ఎన్నో.  మనం ఏం చేసినా కోపగించకుండా మనకి ఎప్పుడూ ఉపకారమే చేస్తుంది భూమాత.  మనల్ని జీవితాంతం భరిస్తోంది.  అలాంటి భూదేవికి మనం పక్కదిగే ముందు నమస్కరించి దిగటం, మన మనుగడకి ఆధారమైన ఆవిడకి కృతజ్ఞత తెలపటం మన విధి కదా.


ఈ భూదేవికి  మనం కృతజ్ఞతలు తెలిపే విధానాలు ఎన్నో.  నాట్యం చేసేవారు, అమ్మా నా పాదఘాతంతో నిన్ను నొప్పిస్తున్నాను, క్షమించు అని నాట్యం ప్రారంభించే ముందు భూవందనం చేస్తారు.  ఆలాగే పంటలు వేసేటప్పుడు, ఇళ్లు కట్టేటప్పుడు ముందు భూమి పూజ చేస్తాము కదా.  అలాగే మనం ఇంటిముందు చిమ్మి నీళ్ళుజల్లి ముగ్గు వేస్తాముకదా.   అదికూడా భూమి పూజే.  పెద్దలు ఎమి చెప్తారంటే జీవితంలో మనమీద ఆధారపడినవారిని ఆదరించాలి, అలాగే మనం వేటిమీద ఆధారపడి వున్నామో  వాటికి వందనం చెయ్యండి, కృతజ్ఞతలు తెలుపుకోండి.

మన జీవితంలో మనకు అనుకూలంగా వుండేవాటికీ, మనకి మంచి చేసేవాటికీ మనం  శిరస్సు వంచి నమస్కరించాలి, కృతజ్ఞతలు తెలుపుకోవాలి.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం కార్యక్రమం ఆధారంగా) 



1 comments

Friday, December 4, 2009

నిద్ర లేవగానే పక్క దిగకుండా దైవ ప్రార్ధన చెయ్యాలంటారు. ఎందుకు?

Friday, December 4, 2009
నిద్ర లేవగానే పక్క దిగకుండా దైవ ప్రార్ధన చెయ్యాలంటారు. ఎందుకు?




ఏ మనిషైనా నిద్ర లేవగానే హడావిడిగా పనులలోకి దిగకుండా, అలా పడుకునే కొద్దిసేపు కళ్ళు మూసుకుని భగవంతుని తలుచుకోవాలి అంటారు. భగవంతుడంటే, ఎవరిని తలుచుకోవాలోకూడా చెప్పారు. ఇష్టదైవం, గణపతి, కుల దైవం, గురువు, లక్ష్మీ దేవి, సప్త సముద్రాలు, సప్త ఋషులు, పర్వతాలు, ఆంజనేయ స్వామి లాంటి చిరంజీవులు, నవగ్రహాలు, అష్ట దిక్పాలకులు, పంచ భూతాలు, జీవ నదులు, తల్లిదండ్రులు ఇలా అందరినీ తలుచుకోవాలి.






ఇలా తలుచుకోవటంవల్ల లాభం ఏమిటి? మనం మానవమాత్రులం. మన జీవితాల్లో ఏ కొంచెం సాధించినా చాలా గొప్పగా భావిస్తాము. కొన్నిసార్లు లేనిపోని అహంభావాలకుకూడా తావిస్తాము. కానీ ఉదయమే లేవగానే ఇలా మహనీయులందరినీ తలుచుకోవటంతో ఆధ్యాత్మికంగా మనకు వారందరి ఆశీస్సులూ లభిస్తాయి, మనసు ప్రశాంతంగా వుంటుంది. లౌకికంగా చూస్తే అంతటి మహనీయులముందు మనం సాధించినది ఎంత, ఇంకా ఎంతో సాధించాల్సింది వుంది అనే భావం కలుగుతుంది. మనకి మనం ఎంత గొప్పవారమైనా, ఎంత సాధించినా, వీరందరి ముందు మనం పరమాణువులకన్నా తక్కువ వారమని, మనం సాధించాల్సింది ఇంకా చాలా వుందని తెలుసుకుని మన అహంభావాన్ని పక్కనబెట్టి ఇంకా ఎదగటానికి ప్రయత్నిస్తాము. అంతేకాదు. కాసేపు ప్రశాంతంగా వుండి మనం ఏమిటి? మన స్ధాయి ఏమిటి? మనం రోజు ఎక్కడనుంచి మొదలు పెట్టాలి? వగైరా ఆలోచించి, పధ్ధతి ప్రకారం ప్రణాళిక వేసుకుని ఆరోజు మొదలు పెట్టచ్చు. దాని మూలంగా అనవసరమైన కంగారు, గందరగోళం లేక ప్రశాంతంగా పనులు చేసుకోవచ్చు.






ఇవ్వన్నీ ఏదో బాగానే వున్నట్లున్నాయి కదా. పోనీ ప్రయత్నించి చూస్తే పోలా. రేపటినుంచి మీరూ ప్రయత్నించండి.






(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)


0 comments

తెల్లవారుఝామున నిద్ర లేవాలంటారు. ఎందుకు?

తెల్లవారుఝామునే ఎందుకు లేవాలి?

 

  మన పెద్దలు తెల్లవారుఝామునే బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి అంటారు.  బ్రాహ్మీ ముహూర్తం అంటే సూర్యోదయానికి గంటన్నర ముందు. పద్మ పురాణం, వాయు పురాణం, స్కాంద పురాణం, ఇంకా అనేక పురాణాలలో కూడా ఈ ప్రస్తావన వుంది.  ఆధ్యాత్మికంగా అలా లేవని వారికి బ్రహ్మ హత్యా దోషం పడుతుందని, వారిని లక్ష్మి వదిలి వెళ్ళిపోతుందని, దరిద్రం వెంటాడుతుందనీ అంటారు.  ఇది నిజమేనా?  లేకపోతే ఏదో పెద్దలు పిన్నలని పెందరాళే నిద్రలేపటానికి చెప్పే విషయాలా?  పోటీ పరీక్షలకి వెళ్ళే విద్యార్ధులనుకూడా తెల్లవారుఝామునే లేచి చదవమంటారు.  ఎందుకు?

  ఆధ్యాత్మికంగా చూస్తే ఆ సమయంలో పితృదేవతలు, దేవతలు కలిసి వుంటారు.  అందరూ మనల్ని ఆశీర్వదిస్తారు..  మన ఆయుష్షు, ఆరోగ్యం పెరుగుతాయి.  ఇంకొక విషయం  ఆ సమయం కుజుడి సమయం.  కుజుడు ఉత్తేజానికి మారు పేరు.  అంటే ఆ సమయంలో ఏమి చేసినా బుఱ్ఱకి పడుతుంది.  ఆ సమయంలో ఏ శబ్దాలూ లేకుండా ప్రశాంతంగా వుండటం కూడా కారణం.  సోమరితనం, బధ్ధకం వదిలిపోతుంది.

  ఇంకొక విషయం గమనించారా?  ఏ మతం వాళ్ళయినా తెల్లవారుఝామున ప్రార్ధన చేస్తారు.

  ఇంక శాస్త్రీయంగా ఆలోచిస్తే  తెల్లవారుఝామున లేచేవారికి ఆయుష్షు పెరుగుతుందంటారు.  ఆయుష్షు పెరగాలన్నా, ఆరోగ్యంగా వుండాలన్నా తెల్లవారుఝామున లేవాలి.  ఇదెక్కడి ఫిట్టింగండీ, ఆరోగ్యంగా వుండాలన్నంత మాత్రాన తెల్లవారుఝామున లేవాలా!?  అని అంటున్నారా  తెల్లవారుఝామున ముడుచుకు పడుకోవటంతో పక్షవాతం, హృద్రోగం, నరాల జబ్బులు వగైరా చాలా జబ్బులు వస్తాయి.  ఆ సమయంలో లేచి వ్యాయామం చెయ్యటం, పనులు చేసుకోవటంతో ఆ జబ్బులు రాకుండా నియంత్రించుకోవచ్చు, తద్వారా ఆరోగ్యం, ఆయుష్షు పెంచుకోవచ్చు.  (మన ఆయుష్షు ముందే నిర్ణయింపబడి వుంటుందంటారుకదా, జబ్బులు లేకపోతే ఆరోగ్యం బాగుంటుందికానీ ఆయుష్షు పెరుగుతుందా!? )  అంతేకాదు, మనసుకి ప్రశాంతత చిక్కుతుంది.  అందుకే తెల్లవారుఝామునే లేవాలంటారు.  (అన్నీ బాగానే వున్నాయిగానీ, ఈ సాఫ్ట్ వేర్ కాలంలో ఎంతమంది తెల్లవారుఝామునే లేవగలరండీ?????)



2 comments

Thursday, December 3, 2009

అయ్యప్ప దీక్షా సమయంలో భూ శయనం ఎందుకు చెయ్యాలి?

Thursday, December 3, 2009
ఒక్క అయ్యప్ప దీక్షలోనే కాదు, మన సాంప్రదాయంలో అనాదినుంచీ ఏ దీక్షలో వున్నవారయినా భూ శయనం చెయ్యటం, అంటే నేలమీద చాప మాత్రం వేసుకుని నిదురించటం ఆనవాయితీగా వుంది. పూర్వం గురుకులాలలో విద్యాభ్యాసం చేసేవాళ్ళు నేలమీదే నిద్రించేవారు. అలా ఎందుకంటే నేల కఠినంగా వుండటంతో అలిసిన శరీరానికి ఎంతమటుకు నిద్ర అవసరమో అంత మటుకే నిద్ర పోగలరు. తర్వాత అటూ ఇటూ కదిలేటప్పుడు నేల గట్టిగా వుండి ఎక్కువ సేపు పడుకోలేక లేచి తమ పనులు చూసుకుంటారు. పూర్వం బ్రహ్మచారులకు, గురుకులవాసులకు అనేక కార్యక్రమాలు వుండేవి. ఉపాసన, గురు శుశ్రూష, ఇలా అన్ని పనులూ పూర్తి చేసుకుని ఉదయం చదువుకు కూర్చోవాలి. అందుకే వాళ్ళు అవసరమైనంతమటుకే నిద్రపోవాలి.

ఆ నియమాన్ని ఏ దీక్షలోవున్న వాళ్ళయినా పాటిస్తారు. వారి మనసు సుఖాలవైపు ఆకర్షింపబడకూడదు. దీక్ష ఫలితాన్ని పూర్తిగా పొందాలంటే వారికి బధ్ధకం వుండకూడదు. అందుకే నియమాలు.

ఈ భూ శయనం వల్ల ఇంకొక గొప్ప ఉపయోగం ఏమిటంటే నడుం నొప్పి రాదు. నొప్పులు సవరింపబడతాయని వైద్య శాస్త్రం చెబుతోంది. అలాగే కామ క్రోధాలు అణిగి పోతాయని ధర్మ శాస్త్రం చెబుతోంది. అందుకే దీక్షా సమయంలో భూ శయనం.


(జీ టీ వీ ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)

0 comments

Wednesday, December 2, 2009

దృష్టి దోషాలు వున్నాయా?

Wednesday, December 2, 2009
దృష్టి దోషాలు వున్నాయా?

సాధారణంగా పిల్లలకి దిష్టి తగిలిందని దిష్టి తీస్తారు. దిష్టి అంటే చెడు దృష్టి. ఇది ఉన్నదనే చెప్పాలి. అందరూ సాధారణంగా ఒప్పుకుని పాటించే ఈ దృష్టి మన సాంప్రదాయంలో వుంది. శాస్త్రబధ్ధమనికూడా మనవాళ్ళు చెబుతారు.

మన శరీరంలోంచి ప్రతికూల శక్తి (negative energy) విడుదల చేసే అవయవాలు కొన్ని వున్నాయి. వాటిలో కళ్ళు కూడా ఒకటి. Optic nerve లో 1.2 million censury glands (జ్ఞాన తంతువులు) వున్నాయి. ఇవి వివిధ రకాల జ్ఞానాన్ని మెదడుకు చేరవేస్తాయి...చూసిన విషయాన్ని అవగాహన చేసుకుని భావాల్ని తిరిగి మన కళ్ళల్లో ప్రస్ఫుటం చేసే శక్తి వీటికి వుంది. ఏదైనా వస్తువు చూసినప్పుడు ఎంత బాగుదో అనుకోవటం సహజం. అది ఒక్కోసారి ప్రతికూల భావాల్నికూడా పంపించవచ్చు. కంటినుంచి వెళ్ళే ప్రతికూల శక్తి ఎదుటివారిమీద పడ్డప్పుడు ఆ ప్రభావం వారిమీద పడుతుంది. అదే దిష్టి. అందుకే దిష్టి తీయమంటారు. ఈ దిష్టి తగిలిన పిల్లలు వూరికే ఏడవటం, చికాకు పెట్టటం చేస్తారు. పెద్దలకు తలనొప్పి, చికాకు వగైరాలు. కొన్నిసార్లు దిష్టి తీస్తే వీరు వెంటనే మామూలుగా అవటం గమనిస్తాము.

మనకి దిష్టి తీసే శక్తి వుందా? వుందనే చెప్పవచ్చు. కొన్ని దృష్టి దోషాలు రాకుండా ముందే జాగ్రత్త పడతారు. గృహ ప్రవేశం సమయంలో గుమ్మడికాయ పగలగొట్టి, దానికి కుంకుమ పూసి గుమ్మానికి అటూ ఇటూ పెడతారు. ఇది దృష్టిదోష నివారణకే. అందరి దృష్టి ముందు ఇంటిమీద కాకుండా దీనిమీద పడితే దోషాలేమీ వుండవని. ఇంటి ముందు బూడిద గుమ్మడికాయ వేలాడదియ్యటం కూడా దీనికే. చిన్న పాపాయిలకి దిష్టి చుక్క పెడతారు. పెళ్ళిలో పెళ్ళికూతురుకీ, పెళ్ళి కొడుకుకీ బుగ్గన చుక్క పెడతారు. ఇవ్వన్నీ దిష్టి దోష నివారణకే.

కొందరు ఎఱ్ఱ నీళ్ళు దిష్టి తీసి బయట పారబోస్తారు. దానితో ప్రతికూల శక్తిని బయటకు పంపిస్తారు. ఉప్పు మెరపకాయలు దిష్టితీసి నిప్పుల్లో వేస్తారు. అప్పుడు వచ్చే కోరుతో దగ్గు వస్తుంది. ఆ దగ్గుతో ప్రతికూల శక్తి బయటకు వచ్చేస్తుందని నమ్మకం.

ఇంత రాశానుగానీ నేను ఈ దిష్టిని ఇంతమటుకూ నమ్మలేదండీ. కొందరు చీటికీ మాటికీ దిష్టి తీసేస్తారు. మరీ అంత చాదస్తంకూడా వుండకూడదు.

(జీ టీవీ ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)

3 comments

Tuesday, December 1, 2009

ఆంజనేయస్వామికి సింధూరం ఎందుకు పూస్తారు?

Tuesday, December 1, 2009
ఈ ఆనుమానం, సందేహం చాలామందికి వుంది. దీనికో పౌరాణిక కధ వుంది. రామాయణకాలంలో సీతమ్మవారు పాపిడిలో సింధూరం ధరించేది. ఒకసారి ఆంజనేయస్వామి అది చూసి అలా ఎందుకు ధరిస్తున్నారని సీతమ్మని అడీగారు. అందుకు సీతమ్మ నీ స్వామి, నాస్వామి అయిన శ్రీరామచంద్రుని ఆయుష్షు పెరగాలనీ ఆయనకి అన్నీ శుభాలు జరగాలనీ పాపిడిలో సింధూరం ధరిస్తాను. ఆడవారు పాపిడిలో సింధూరం ధరిస్తే మగవారి ఆయుష్షు పెరుగుతుంది, వారికి అన్నీ శుభాలు జరుగుతాయి అని చెప్పిందట.

ఆంజనేయస్వామి రాముడికి పరమ భక్తుడు. ఆయన వూరుకుంటాడా!? వెంటనే వెళ్ళి ఒళ్ళంతా సిధూరం పూసుకొచ్చాడు. సీతమ్మ అడిగిందట. ఒళ్ళంతా సిధూరం ఎందుకు పూసుకున్నావని. దానికి ఆయన సమాధానం, ‘అమ్మా, నువ్వు పాపిడిలో సింధూరం పెట్టుకుంటేనే స్వామి ఆయుష్షు పెరుగుతుందనీ, శుభం జరుగుతుందనీ అన్నావు కదా, మరి నేనాయన భక్తుణ్ణి, నేను ఒళ్ళంతా సింధూరం పూసుకుంటే నా స్వామికి ఇంకా ఎక్కువగా అన్నీ శుభాలే జరుగుతాయనీ, ఆయన చిరంజీవి కావాలని ఇలా పూసుకున్నాను’ అని చెప్పాడు.

ఇది వాల్మీకి రామాయణంలో కధకాదు. రామాయణాన్ని చాలామంది రచయితలు చాలాసార్లు రాశారు. తర్వాత వచ్చిన రామాయణంలో వచ్చిన కధ ఇది.

అది పురాణ కధ అనుకోండి. లౌకికంగా చూస్తే ఆంజనేయస్వామి వాయుదేవుని పుత్రుడు, సూర్యదేవుని శిష్యుడు. వారిరువురూ ఎంతో తేజస్సు కలవారు. అందుకే ఆంజనేయస్వామి అమిత తేజోమూర్తి. ఎరుపు లేక సింధూరం తేజస్సుకి చిహ్నం. ఆయన తేజస్సుకి చిహ్నంగా ఆయనను సింధూరంతో అలంకరిస్తే స్వామి చూడటానికే ఎంతో తేజోవంతుడుగా కనుల విందు చేస్తాడనీ, ఆయన తేజస్సూ, శక్తీ మనకి వెంటనే స్ఫురిస్తుందనీ అలా అలంకరిస్తారు.

ఇంకొక విషయం తెలుసా ఆంజనేయస్వామి రామ భక్తుడుకదా. శ్రీరామ పూజ ఎక్కడ జరిగితే అక్కడ ఆంజనేయ స్వామి వుంటాడు. ఆ పూజ చూడటానికీ, ఆ నామ కీర్తన వినటానికీ. అందుకే శ్రీరామచంద్రుని పూజ చేసేటప్పుడు ఒక ఖాళీ ఆసనాన్ని వేసి వుంచాలిట. అక్కడ ఆంజనేయస్వామి ఆసీనుడై శ్రీ రామ పూజ తిలకిస్తాడని నానుడి.

(జీ టీవీ ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)

4 comments