Wednesday, March 3, 2010

శివ మానస పూజ ఎలా చేస్తారు?

Wednesday, March 3, 2010


శివార్చన, లేదా ఏ దేవతార్చనైనా మానవులకు మంచి ఫలితాలనిస్తాయంటారు.  అయితే అనేక కారణాలవల్ల అందరికీ ప్రతి రోజూ యధావిధిగా పూజ చేయటం కుదరకపోవచ్చు.  వృధ్ధాప్యంవల్ల, అనారోగ్యంవల్ల, ప్రయాణంలో, ఇలా కూర్చుని అభిషేకమూ, అర్చనా చేసే అవకాశం లేక పోయినా, చెయ్యాలనే తపన మాత్రమున్నవాళ్ళు మరి ఏం చెయ్యాలి?  ధర్మ గ్రంధాలు ఏం చెబుతున్నాయి?

అసలు భగవంతుని పూజలో మానసిక పూజే విశేషమయినది.  మనసులో భగవంతుని నిలుపుకోవటం అలవాటు చేసుకోవటానికి, మనసు నిశ్చలంగా వుండటానికి ప్రత్యక్షంగా విగ్రహాన్ని పూజించాలి. 

అలా కుదరనప్పుడు, మన మానసిక శక్తిని పరీక్షించుకోవటానికి,  భగవంతుణ్ణి మన మనసులో నిలుపుకోవటానికి భగవంతుడు కల్పించిన అవకాశంగా దాన్ని భావించి మానసిక పూజ చేసుకోవాలి.  అది ఎలా చెయ్యాలి?  భగవంతుడు అక్కడ వున్నాడని భావించి  ఆయనకి రత్న సింహాసనం వెయ్యాలి.  ఆకాశ గంగని తెచ్చి మనసారా  అభిషేకించాలి.  వివిధ రకాల ఆభరణాలతో అలంకరించాలి.  సుగంధ భరితమైన పూవులతో, మారేడ దళాలతో పూజించాలి.  ధూపం, దీపం అన్నీ సమర్పించాలి.  షడ్రషోపేతమైన వివిధ భక్ష్యభోజ్యాలను, మధుర ఫలాలను నివేదించాలి.  స్వామీ, నేను చేసిన వివిధ సపర్యలు స్వీకరించి నన్ను దయచూడమని వేడుకోవాలి.

బాహ్యంగా విశేష పూజ చేసే అవకాశం లేనివారు బాధపడకుండా భగవంతుడు అది మనకిచ్చిన అవకాశంగా తీసుకుని భగవంతుని మనసులో నిలుపుకుని పూజించవచ్చు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)

మనలో మాట

ఈ మానసిక పూజ వల్ల నాకు కనబడ్డ ఇంకో విశేషమేమిటంటే  బాహ్యంగా మనం సమకూర్చుకునే సంబారాలు కొన్నే వుంటాయి కానీ మానసికంగా మన వూహ పదునును బట్టి ఎక్కడెక్కడి పదార్ధాలూ, పువ్వులూ, అత్యంత అందమైన ఆభరణాలు వగైరా సమర్పించవచ్చు.

0 comments: