Monday, September 13, 2010

పక్షి పూజ ఎందుకు చెయ్యాలి?

Monday, September 13, 2010



పక్షి పూజ చెయ్యటమంటే పక్షులను తెచ్చి, పసుపు కుంకాలు, పూలు పెట్టి పూజ చెయ్యమని అర్ధం కాదు.  భూత దయ కలిగి వుండటం.  మన శాస్త్రాలు భూత యజ్ఞం చెయ్యాలని చెప్తాయి.  అంటే సర్వ ప్రాణులయందు దయ కలిగి వుండాలి.  వాటికి ఆహారాన్ని ఇవ్వాలి అని.  అందుకే భోజనం చేసేముందు ప్రతి వ్యక్తీ,  ప్రతి రోజూ ఎంగిలి చెయ్యకముందు ఒక ముద్ద పక్షుల కోసం బయట పెట్టి రావాలి.

వ్యవసాయ ప్రాధాన్యంగల ప్రాంతాల్లో, పంట వచ్చాక, అది ఏ పంటైనా, గుత్తులుగా గుచ్చి ఇంటి ముందు కడతారు.  అలా చెయ్యటం తోరణాలకోసమో, అందానికో కాదు.  పక్షుల కోసం.  కొంతమంది గుడికెళ్ళి మొక్కుకుంటారు.  పంట బాగా వస్తే దేవాలయంలో పక్షులకి ఆహారం పెడతామని.  అదే విధంగా పంట వచ్చాక దేవాలయంలో గుత్తులుగా ధాన్యంతో సహా కంకులు తోరణాల్లా కడతారు.

ఇలా ఇళ్ళల్లో, దేవాలయాల్లో కంకులు కట్టటం వల్ల తెలియక చేసిన దోషాలన్నీ పోతాయనీ, సిరి సంపదలతో సుఖంగా వుంటారనీ నమ్మకం.

కొన్ని చోట్ల కఱ్ఱలు పాతి వాటికి కంకులు కడతారు.  అనీ పక్షుల కోసమే.  కొందరు, ఆకులో వండిన అన్నం పెట్టి, రంగులు వేసి వీధి కూడలిలో పెట్టి దానిని పక్షులు తిన్నాయో లేదో గమనిస్తారు.  దానిని పక్షులు తింటే తమ కుటుంబంలో అందరూ సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో తులతూగుతారని విశ్వసిస్తారు. 

సర్వ ప్రాణులయందు దయ కలిగి వుండి, పక్షులకోసం ధాన్యాన్ని, అన్నాన్ని రోజూ పెట్టటంవల్ల తెలియక చేసిన దోషాలు పోయి, సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం.

(జీ తెలుగు ఇదివరకు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా.  నేనప్పుడు పోస్టు చెయ్యని వాటిలో ఉపయోగ పడేవాటిని కొన్నింటిని ఇప్పుడు పోస్టు చేస్తున్నా.)



0 comments: