Thursday, December 23, 2010

లక్ష్మీదేవి తలపై వుండకూడదంటారు. నిజమేనా?

Thursday, December 23, 2010


నిజమే.  అయితే  పెద్దలు చెప్పిన ప్రతిమాటకీ  మనం మాటల అర్ధమేకాక ఆ మాటలకంతర్లీనంగా వున్న అసలు అర్ధం కూడా తెలుసుకుంటే బాగుంటుంది కదా.

లక్ష్మీదేవి అంటే ఒక్క ధనమే కాదు.  మనిషికి వున్న ప్రతి నైవుణ్యమూ లక్ష్మీదేవే.  ఆవిడ తలపై వుండకూడదు అంటే మనిషికున్న ధనంవల్లగానీ, నైపుణ్యం వల్లగానీ వచ్చే అహంకారం తలకెక్కకూడదు.  దీనికి ఒక పురాణ కధ చెప్తారు.

పూర్వం జంభాసురుడు అనే రాక్షసుడు త్రిలోకాధిపత్యం కోసం శివుడి గురించి ఘోర తపస్సు చేస్తాడు.   అతని తపస్సుకి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై అతను కోరుకున్న వరం ఇచ్చాడు.  ఇంకేముంది.  జంభాసురుడు దేవతల మీద దండయాత్ర చేసి ఇంద్ర పదవి చేజిక్కించుకుని ఇంద్రుణ్ణి తరిమి కొట్టాడు.  పాపం ఇంద్రుడు ఇతర దేవతలను తీసుకుని బ్రహ్మ దేవుడూ, దేవతల గురువైన బృహస్పతి దగ్గరకెళ్ళి  సమాలోచన చేశాడు.  వారు దగ్గరలో సహ్యాది పర్వతంపైన వున్న దత్తాత్రేయుని శరణువేడమని, ఆయన తప్ప ఇంద్రుని ఆపద తీర్చేవరెవరూ లేరని సలహా ఇస్తారు. 

ఇంద్రుడు వారి సలహాపై దత్తాత్రేయుని శరణువేడుతాడు.  దత్తాత్రేయుడు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తాడు.  అసలు ఇంద్రుణ్ణి గుర్తుపట్టనట్లు వుంటాడు.  ఇంద్రుడు అతణ్ణి పరి పరివిధాల ప్రార్ధించి నువ్వు తప్ప వేరే గతి లేదంటే, చివరికి కరుణించి తన నిజస్వరూపం చూపిస్తాడు.  ఇంద్రుని ప్రార్ధనలాలకించి, ఉపాయం చెబుతాడు.  నువ్వు  దేవతలతో సహా వెళ్ళి జంభాసురుడిని నా ఆశ్రమం దగ్గరకు తీసుకు రమ్మంటాడు.  దత్తాత్రేయుని ఆజ్ఞ ప్రకారం ఇంద్రుడు తన సైన్యంతో సహా వెళ్ళి జంభాసురునితో యుధ్ధం చేస్తున్నట్లు నటిస్తూ వెనక్కి వెనక్కి నడుస్తూ దత్తాత్రేయుని ఆశ్రమం దగ్గరకు తీసుకొస్తారు.  యుధ్ధం చేస్తూ ముందుకు వస్తున్న జంభాసురుడు  దత్తాత్రేయుని ప్రక్కన వున్న ఆయన భార్య అనఘా దేవిని చూస్తాడు.  ఆమె అమోఘ సౌందర్యం చూసి మోహిస్తాడు.  ఆమెను తనతో తీసుకు వెళ్ళాలని ప్రయత్నిస్తాడు.  అనఘా దేవి భర్త వంక చూస్తుంది.  దత్తాత్రేయుడు వెళ్ళమని సైగ చేస్తాడు.  అప్పుడు అనఘాదేవి జంభాసురుడికి ఒక షరతు విధిస్తుంది.  నాకు నీ శిరస్సుపై నాట్యం చెయ్యాలని వుంది, అలా నాట్యం చెయ్యనిస్తే వస్తాను అని చెబుతుంది.  జంభాసురుడు అంత అద్భుత సౌందర్యరాశి తన శిరస్సుపై నాట్యం చెయ్యటానికి సంతోషంగా అంగీకరిస్తాడు.  అనఘాదేవి జంభాసురుని శిరస్సుపై నాట్యం చేస్తుండగా ఆ తన్మయత్వంలో, ఆ మత్తులో జంభాసురుడి సైన్యాన్ని సురసేనలు దునుమాడుతాయి.  నాట్యమయినా ఆ పరాకులోనే వున్న జంభాసురుణ్ణి ఇంద్రుడు సంహరిస్తాడు.

ఇది ఎలా సాధ్యమయింది.  అనఘాదేవి సాక్షాత్తూ మహాలక్ష్మి స్వరూపం.  మహలక్ష్మి తమదగ్గరవుందని ఎవరికైతే గర్వం వస్తుందో  లక్ష్మి వాళ్ళ నెత్తికెక్కుతుందంటారు.  మనిషి దగ్గర లక్ష్మి ఏ రూపంలోనైనా వుండచ్చు, అందం, ఐశ్వర్యం, విద్య, ఏదైనా కళలో నైపుణ్యం, ఇలా.  లక్ష్మి తమ దగ్గర వున్నదని సంతోషించి, దానిని సద్వినియోగపరచినంతమటుకూ పర్వాలేదు.  కానీ, ఎవరికైనా తనకున్న నైపుణ్యాన్ని చూసుకుని  గర్వం బాగా తలకెక్కినప్పుడు, కన్నూ మిన్నూ గానక ప్రవర్తించినప్పుడు, మనిషి పతనానికి అది మొదలు.  తమంత వారు లేరన్న గర్వం ఎవరికి వస్తుందో, వారి తలమీద లక్ష్మీదేవి నాట్యమాడుతూ వారి పతనానికి కారణమవుతుంది. విపరీతమైన అహంకారం వున్నవారికి లక్ష్మి తలమీద నాట్యంచేసి అణచి వేస్తుందని ఈ కధ తెలియజేస్తుంది.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)













1 comments

Wednesday, December 22, 2010

ప్రమదావన జ్యోతికి పుట్టిన రోజు జేజేలు

Wednesday, December 22, 2010

 ప్రమదావన జ్యోతికి పుట్టినరోజు జేజేలు

ఈరోజు మన జ్యోతి పుట్టిన రోజు.  రెండేళ్ళ క్రితం ఈ జ్యోతి ఎవరో తెలియదు.  ఎక్కడ వుంటుందో తెలియదు.  అసలు ఏం చేస్తుందో తెలియదు.  కానీ ఇప్పుడు బ్లాగర్లల్లో చాలామందికి మిత్రురాలు.  ప్రమదావనంలో అందరికీ ఆప్త మిత్రురాలు,  వెరసి మన జ్యోతి.  అంతేకాదు.  మొన్న మొన్నటిదాకా ఏమీ తెలియని ఈ గృహిణి కంప్యూటర్ కీ బోర్డుమీద చెయ్యి పెట్టినదగ్గరనుంచీ  ఆ కంప్యూటర్ విద్యల లోతుపాతులు, ముఖ్యంగా బ్లాగులకు సంబంధించి, ఇట్టే అవుపోసనపట్టి నాలాంటి ఎందరో బ్లాగర్ల బ్లాగుల డిజైనర్ అయింది, ఎందరో కొత్త బ్లాగర్లకు బ్లాగ్ గురు అయింది.  అందుకే మా బ్లాగ్ డిజైనర్ కి, బ్లాగ్ గురుకి పుట్టిన రోజున  శుభాకాంక్షలు ఈ చిరుకానుకతో. 


తొలి పూజలందుకునే ఆ విఘ్ననాయకుడు తన తల్లి దండ్రులతో సహా సదా మీపై తమ కరుణా  కటాక్ష వీక్షణాలు ప్రసరింప చెయ్యాలని ఆకాంక్షిస్తున్నాను.


రోజంతా హాయిగా గడిపి సాయంత్రం కుటుంబ సభ్యులతో సంతోషంగా షికారుకెళ్ళిరండి.  మరొక్కసారి పుట్టినరోజు  శుభాకాంక్షలు.




2 comments

Monday, December 13, 2010

ఎలాంటి పాపాలు చేస్తే ఎలాంటి దోషాలు వస్తాయి

Monday, December 13, 2010



తల్లిదండ్రులను నిర్లక్ష్యం చెయ్యటం, దూరంగా వుంచటం, నమ్మినవారిని, భార్యా పిల్లలని నట్టేట ముంచటం, వారిని వదిలేసి మనదారి మనం చూసుకోవటం పాపం.  పురుషుడుగానీ, స్త్రీగానీ సంతానాన్ని వదిలేసి దూర దేశాలకు వెళ్ళినా, రెండవ పెళ్ళి చేసుకున్నా పాపం.  మనం తింటూ ఎదుటివారికి పెట్టకపోవటం, ఇంటిముందున్న కుక్కకి, పక్షికి ఆహారం పెట్టకపోవటం, ఎండలో వచ్చినవారికి మంచినీరివ్వకపోవటం కూడా దోషమే.  అతిధులకు ఏ వేళకి వచ్చినవారికి ఆ విధంగా తగు మర్యాద చెయ్యాలి.  అలాగే మన సహాయం కోరి వచ్చినవారికి సహాయం చేయగలిగి చేయకపోవటం మంచిదికాదు.  తప్పు తెలిసీ సరిచెయ్యకపోవటంకూడా దోషమే.

మన పూర్వీకులు క్రమశిక్షణకోసం, సక్రమమైన జీవన విధానానికి ఏ వేళకి ఏమి చెయ్యాలో నియమాలు, ఎన్నో పరుధులు ఏర్పాటుచేసి, ఎక్కడెక్కడ ఎలా నడుచుకోవాలో కొన్ని విధులు ఏర్పరచారు.  వాటిని నెరవేరిస్తే మనిషి సంతోషకరమైన జీవనం గడపగలడుచ

ప్రపంచంలో ప్రతి ప్రాణీ దైవ స్వరూపమే. మనిషి  ఆ సద్భావంతో సత్ఫ్రవర్తన కలిగి వుండాలి.  లేకపోతే మనం ఇప్పుడు ఏ అవయవంతో ఏ దోషం చేస్తామో మరు జన్మలో ఆ అవయవాలకి అలాంటి దోషాలుకలిగి బాధపడాల్సివస్తుంది.  పాపం అంటే ఎక్కడో మనకు కనబడకుండా వుండేదికాదు.  మన నిత్యజీవితంలో మన ఎదురుగా కనబడే అడ్డంకులు, రోగాలు, చికాకులే.  మనం ప్రశాంతమైన జీవితం గడపాలంటే మనమీద ఆధారపడినవారికి, ప్రకృతికి మనం ఎలాంటి హానీ చెయ్యకుండా జీవించాలి.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)



0 comments

Sunday, December 12, 2010

ఆవునెయ్యి ఉపయోగాలేమిటి? ఆవునెయ్యి వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుందా?

Sunday, December 12, 2010



ఆవునెయ్యి ఆరోగ్యానికి ఉపయోగకరమనీ, వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుందనీ ప్రయోగపూర్వకంగా నిరూపితమైంది.  దీపారాధన చెయ్యటానికీ, యజ్ఞయాగాలకూ ఆవునెయ్యిని వినియోగిస్తారు.  ఆవునెయ్యితో వెలిగించిన దీపం వున్న గదిలో వున్నవారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  యజ్ఞయాగాదులలో ఆహుతి చేసిన ఆవునెయ్యి నుంచి వచ్చిన ఆవిరి ఆకాశంలో 7, 8 కి.మీ. ఎత్తుకి వెళ్ళి వర్షాలు పడతాయని రష్యా శాస్త్రవేత్తలు పరిశోధన చేసి కనిపెట్టారు.  మనవాళ్ళు కృత్రిమ వర్షాలు కురిపించటానికి మేఘమధనానికి వాడే కెమికల్స్ వల్ల కురిసే వర్షాలలో నీరుకూడా కాలుష్యమయమై వుంటుంది.

పురాణాలలో కధ ప్రకారంకూడా గాంధారి గర్భపాతం చేసుకున్నప్పుడు ఆ అండాన్ని కుండలలో ఆవునెయ్యిలో భద్రపరిచారుట.  ఆయుర్వేదంలో ఎన్నో మందులలో ఆవునెయ్యి కలుపుతారు.  ఘృతం అంటారు ఆవునెయ్యిని.  ఆవునెయ్యికి కొన్ని ఏళ్ళవరకు భద్రపరిచే గుణం వుంది.


ఆరోగ్యానికి కూడా ఆవునెయ్యి మంచిది.  ఈ మధ్య ఆరోగ్యంకోసమని చాలామంది నెయ్యి, నూనె తినటం మానేస్తున్నారు.  కానీ ఆవునెయ్యి తినటంవల్ల కొలెస్ట్రాల్  నియంత్రణలో వుంటుంది.  రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.  అల్సర్స్ నయమవుతాయి.  జీర్ణక్రియని ఉత్తేజపరిచి జీర్ణకోశాన్ని కాపాడుతుంది.   శరీరంలో దోషాల్ని కొట్టేసి  కురుపులు రాకుండాఆరోగ్యాన్ని కాపాడుతుంది.  అందుకే రోజూ ఆహారంలో నియమిత రూపంలో ఆవునెయ్యి వాడాలి.

ఆవునెయ్యి మేధస్సును పదునుపరుస్తుంది.  కళ్ళకి మంచి చేస్తుంది.  మనసును ప్రశాంతంగా వుంచుతుంది.  జీర్ణక్రియను బాగుపరుస్తుంది.  అందుకే మిగతా నూనెలు మానేసినా రోజూ రెండు చెంచాలు ఆవునెయ్యిని ఆహారంతో తీసుకుంటే ఎన్నో రోగాలనుంచి దూరంగా వుండవచ్చు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)




0 comments

Thursday, November 11, 2010

కార్తీక స్నానం

Thursday, November 11, 2010


కార్తీక మాసం ప్రారంభం అయంది.  ఔత్సాహికులు తెల్లవారుఝామునే లేచి తలమీద చన్నీటి స్నానాలు చేసేస్తున్నారు.  దీపారాధనలు, శివపూజలు...ఓహ్ రోజంతా హడావిడే.  చూడటానికి బాగుంటుంది.  మరి తెల్లవారుఝామునే లేచి చన్నీళ్ళ స్నానం చెయ్యాలనే వుత్సాహం వున్నా ఆరోగ్యానికి పడనివాళ్ళు తెగ బాధపడిపోతున్నారు.

అసలు మన పెద్దలు ఏదైనా ఆచారమూ, సాంప్రదాయమూ అని ఒక పధ్ధతి పెడితే దాని వెనుక తప్పక ఏదో అర్ధముండే వుంటుంది.  దాన్ని అలాగే చెయ్యాలి అని చెబితే మనలాంటి మొండిఘటాలు చెయ్యకపోతే ఏం అని ఎదురు తిరుగుతాం.  అందుకే ఆచారం, దేవుడు దెయ్యం అనే పేర్లతో కొంచెం భయం పెట్టారు.  ఆ భయం కూడా ఈ మధ్య పోయిందనుకోండి.

అసలు కార్తీక స్నానం ఎక్కడ చెయ్యాలంటే ప్రవహించే నదుల్లో, కాలువల్లో, లేకపోతే దేవాలయాల దగ్గర వుండే పుష్కరిణిలలో, చెరువుల్లో, లేకపోతే కనీసం బావుల దగ్గర చెయ్యాలి.  ఈ మాసం లో చలి బాగా వుండి, నిద్ర లేచేసరికి కండరాలన్నీ పట్టేసి వుంటాయి.  వాటిని స్వాధీనంలోకి తీసుకురావటానికి, ఆరోగ్యంగా వుండటానికి నదీ స్నానమన్నారు.  నదీ స్నానమంటే నది దాకా నడవాలి.  దానితో వ్యాయామం చేసినట్లయ్యి ఒళ్ళంతా చెమట పడుతుంది.  ఇంక నదులు వగైరాలలోని నీళ్ళు పగలంతా సూర్యరశ్మికి వేడెక్కి, రాత్రంతా చంద్రుని కిరణాలతో చల్లబడి సమశీతోష్ణతను సంతరించుకుంటాయి.  పారే నీరు దోవలోని అనేక ఔషధమొక్కల గుణాలనికూడా తనలో కలుపుకొస్తాయి.  అవి ఆరోగ్యకరం.  వాటితో చేసిన స్నానం ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది.

ప్రస్తుతం నగరాలలో పరిస్ధితులు మారాయి.  పైన టాంకుల్లో నింపుకున్న నీటితోనే చెయ్యాలి.  వాటితో చేస్తే అలవాటువున్న వాళ్ళకి పడ్డా, అలవాటు లేనివారికి  లేనిపోని జలుబు, దగ్గు, ఆస్తమా వగైరాలు మేమున్నామని పలకరించవచ్చు.  అందుకని అవసరమైతే ఆ నీటిని కొంచెం వేడి చేసుకోవటం ఆరోగ్యానికి మంచిది.  ఏమంటారు?

0 comments

Sunday, November 7, 2010

హైదరాబాదులో ఆడ బ్లాగర్ల సమావేశం

Sunday, November 7, 2010


ఆడ బ్లాగర్లేమిటి సంధి సరిగ్గాలేదు, కూసింత వ్యాకరణం నేర్చుకోరాదా? అని కూకలేస్తున్నారా  వుండండి బాబూ.  అసలే నిన్నటినుంచీ నాకంతా అయోమయంగా వుంది.  ఆడాళ్ళంతా ఎక్కడోక్కడ ఒకరోజు కలుద్దామని ప్రమదావనంలో ముచ్చట మొదలయింది.   6 వ తారీకు జ్ఞాన ప్రసూన గారింట్లో కలుద్దామన్నారు.  ఏదో ఆడోళ్ళ మీటింగు కదా,  నాలుగు  సినిమాలగురించీ, చీరెలు, నగలగురించి కొత్త కొత్త ముచ్చట్లు విని ఓ నాలుగు మెతుకులు నంజి వద్దామని బయల్దేరుదామనుకున్నానో లేదో, మాలా కుమార్ గారి ఆహ్వానం, ఇద్దరం కలిసి వెళ్దాం రండి అని.

ఇద్దరం కలిసి ఉదయం 11-30కల్లా జ్ఞాన ప్రసూనగారింటికి చేరుకున్నాము.  ఆత్మీయమైన ఆహ్వానాన్ని అందుకుని కూర్చున్నామో లేదో.  శ్రీ లలితగారొచ్చారు.  మరి అందరొస్తుంటే కొంచెం సందడి చెయ్యాలికదా..అందుకే అందరి చేతా గుమ్మంలోనే పేరు చెప్పించి లోపలకి తీసుకొచ్చాను.  తర్వాత జ్యోతి, స్వాతి, సి. ఉమాదేవి, భవాని, లక్ష్మి వచ్చేశారు.  దీపావళి పండగ మర్నాడవ్వటంతో వూళ్ళకి వెళ్ళిన వాళ్లు కొందరు, వేరే కార్యక్రమాలవల్ల కొందరు శారీరకంగా రాలేకపోయినా, మానసికంగా మా దగ్గరే వున్నారు, వీళ్ళేం చేస్తున్నారో, ఏం కబుర్లు చెప్పుకుంటున్నారో మిస్ అయిపోతున్నామే అనుకుంటూ. 

ఉదయం 11-30 నుంచీ సాయంత్రం 5-30 దాకా జరిగిన ఈ మీటింగులో ఒక సినిమా గురించిగానీ, ఒక చీరె గురించిగాని, ఒక నగ గురించిగానీ ఒక్క ముచ్చటకూడారాలేదు.  ఇదెక్కడి ఆడోళ్ళ మీటింగో మరి.  ఆ ముచ్చట్లు ఆశించికూడా ఎవరూ రాలేదులెండి.  వాటి కధా కమామీషూ లేకుండా ఇంతసేపు నోరు ముయ్యకుండా మాట్లాడుకోగలరు నారీమణులు అని నిరూపించేశాము.  మరి మహిళా బ్లాగర్లా మజాకానా.

మాటల మధ్యలో భోజనాలు.  ఏం తిన్నామో, తాగామో చెప్పమంటారా స్ప్రైట్. నాన్, రుమాలీ రోటీ, చనా మసాలా, బగారా బైంగన్, కాకర కాయ చిప్స్, కొత్త వెరైటీ గోంగూర పులిహోర, అన్నం, పెసర పప్పు వామన చింతకాయలు కలిపి పచ్చడి, అద్భుతమైన సాంబారు, చింతకాయ పచ్చడి,  ఆవకాయ, ఇంకా మేము వేసుకోని పచ్చళ్ళు, పూర్ణంబూరెలు, రవ్వ లడ్డూలు, జంతికలు, గులాబ్ జామూన్, ఐస్ క్రీం, చివరాఖరికి టీ.. ఇవి ప్రస్తుతానికి గుర్తున్నవి.   భుక్తాయాసంలో పడి ఇంకేమైనా మర్చిపోయానేమో గుర్తుచెయ్యండర్ర్రా.  అన్నట్లు కార్తీకమాస శుభారంభానికి గుర్తుగా జ్ఞాన ప్రసూన గారు స్వయంగా పూర్ణం బూరెలు చెయ్యటమే కాక తాను తయారు చేసిన ఉసిరికాయ మురబ్బా కూడా తినిపించారు.  కార్తీక మాసంలో ఉసిరి తినాలంటారు.  మేము తినేశామోచ్.

జ్ఞాన ప్రసూన తను వేసిన రకరకాల పైంటింగ్స్, చేసిన పలురకాల చేతి పనులు చూపించారు. ఆసక్తి వుంటే వయసు, ఓపిక అడ్డురావని నిరూపించారు. 

ఇంతలో మలక్ పేట రౌడీగారి అమ్మగారొస్తున్నారన్నారు.  రౌడీగారి తల్లిగారు కదా తెలంగాణా శకుంతల టైపులో వస్తారేమోనని కాస్త సర్దుకు కూర్చున్నా ఎందుకైనా మంచిదని.  ప్రశాంతమైన సరస్వతీదేవిలా వచ్చేశారు ఆవిడ.  నాకేం రాయటం రాదండీ అన్న ఆవిడ శ్రీ భమిడిపాటి రామగోపాలంగారి పుస్తకంలో పొరపాట్లని ఆయనకే చెప్పి, ఆ పుస్తకం పునర్ముద్రణలో  ఆయనకే సహకరించిన రచయిత్రి.  డాక్టరేటు పొందిన విదుషీమణి.   అన్నీ వున్న విస్తరి సామెత  ఆవిడకి సరిగ్గా సరిపోతుందనుకున్నాను.

సమయంకూడా తెలియకుండా, ఒక్క నిముషంకూడా వృధా చెయ్యకుండా అంతసేపు గడిపి, 5-30 అయిందని ఇంటికి బయల్దేరాము.  జ్ఞాన ప్రసూనగారు అందరికీ పసుపు, కుంకుమ, పండు, బ్లౌజ్ పీస్ లే కాక అందమైన బహుమతులుకూడా ఇచ్చారు.  అంతేకాదు, మంచి పుస్తకాలు కూడా ఇచ్చారు వారు, వారి తండ్రిగారు రాసినవి.

అవ్వే కాకుండా ఇంకా కొన్ని  తినుబండారాలుకూడా మూటగట్టుకుని ఇంటికి చేరాము.  ఆహా ప్రమదావనం సభ్యుల అదృష్టమేమని చెప్పవచ్చు! జ్యోతి ప్రమదావనం పెట్టటంవలన కదా మనమంతా ఒకచోట చేరి ఊసులాడుకోవటం మొదలయింది,  హైదరాబాదులో వారందరం ఒకసారి కలుద్దామని ముందు మొదలు పెట్టింది అన్నపూర్ణ అనుకుంటా, వారివల్లకదా ఈ కార్యక్రమం మొదలయింది, మాలా కుమార్ ఎప్పుడోదాకా ఎందుకు 6వ తారీకు కలుద్దామనటంవల్లకదా ఇవాళ కలిసి ఇంత సంతోషంగా గడిపింది, అని వరలక్ష్మి వ్రత కధ టైప్ లో కబుర్లు చెప్పుకుంటూ, మాలా కుమార్, స్వాతి, నేను ఇంటికి తిరిగి వచ్చాము.

సో, హైదరాబాదు సోదరీమణులారా, ఇలాంటి మీటింగులకి రాకపోవటంవల్ల మీరేం  మిస్ అయ్యారో తెలిసిందా?  హమ్మయ్య.  ఈ మాటు మీటింగు పెడితే బుధ్ధిగా వచ్చెయ్యండి.




11 comments

Wednesday, November 3, 2010

సినిమా సందడి

Wednesday, November 3, 2010


తోచీ తోచనమ్మ తోడికోడలి పుట్టింటికెళ్ళిందట.  సరిగ్గా అట్టాంటి పనే చేశాము నేనూ మా ఆయనా తీరి కూర్చుని నిన్న.  రాత్రి 11 గం. దాటినా నిద్ర రాకపోవటంతో టీ వీ ఛానల్స్ తిప్పుతూ మా టీ వీ లో గెస్ ది సెలబ్రెటీ లో ఇద్దరు హీరోలను కలిపిన ఫోటో చూసి మావారు ఠక్కున చిరంజీవి, బాలకృష్ణ అన్నారు.  ఆయన జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలకి సమాధానాలు చెప్తారుకానీ, సినిమా వాటి జోలికి పోరు.  అలాంటిది ఆ అతికించిన ఫోటో చూడగానే వాళ్ళ గురించి చెప్పేశారని సంబరపడిపోయాను.  అక్కడితో ఆగచ్చుగా.  అలా ఆగితే ఈ టపా ఎలా వస్తుంది.  ఫోన్ చెయ్యి అన్నారు.  సరే ఏదో ఒక ఫోన్ కాలేగా  చేస్తే పోలా అనుకున్నాను.  పైగా నా ఫోన్ లో 300 రూ. పైన బాలెన్స్ వుంది.  మహా అయితే ఓ 50 రూ. అవుతుందిలే కాల్ కి వస్తే బహుమతి 25000 రూ. వస్తాయి లేకపోతే ఫోన్ తో కొంచెంసేపు కాలక్షేపం అనుకున్నా. 

ఫోన్ చెయ్యగానే రింగ్ అయింది.  మా ఆయన అదృష్టం బాగుందేమో, అందుకే వెంటనే రింగయిందని ఆయనకి ఇవ్వబోయా.  నాకొద్దు, నువ్వే మాట్లాడు, నీకే ఆ సరదాలని.  నిజం చెప్పొద్దూ ఆ మాటకి నాక్కొపం వచ్చింది.  ఏమీ తోచకపోతే చెల్లెళ్ళతోనో, స్నేహితులతోనో చాలాసేపు ఫోన్లో మాట్లాడే సరదా మాత్రమే వున్న నన్ను టీవీలకీ ఇలాంటి ప్రోగ్రామ్స్ కి ఫోన్ లు తరచూ చేసేదానిగా చిత్రించారనుకుని వుడుక్కున్నాను.  కానీ నా వుడుకుమోతుతనాన్ని కాసేపు పక్కనపెట్టి ఆ ఫోన్ లో వాళ్ళు వాగే....కాదు కాదు....రికార్డు చేసి మాలాంటి మూర్ఖులందరి మొహానా కొట్టే డైలాగులు వింటూ కూర్చున్నాను.  ఓపిగ్గా వేచి చూస్తే అదష్టం మిమ్మల్నే వరించవచ్చు...అని కొంచెంసేపు వూరించారు.  తర్వాత వినేవాళ్ళని ములగ చెట్టు ఎక్కించటానికి...మీరు చాలా తెలివికలవాళ్ళు.  అందుకే ఇంతసేపు వేచి వున్నారు.  మీరు వైటింగ్ లో వున్నారు.  అంటే స్టూడియోకి చాలా దగ్గరలో వున్నారు.  ఏ క్షణమైనా మీ కాల్ కనెక్టుకావచ్చు.... అనే ధైర్య వచనాలు, మీరు కావాలంటే డిస్ కనెక్టు చేసి మళ్ళి రింగ్ చెయ్యవచ్చు అనే సలహాలు.  అమ్మో వినీ వినీ నాకు డైలాగులన్నీ కంఠతా వచ్చేశాయి.

దీనికితోడు మధ్య మధ్యలో రెండు నిముషాలసేపు వైటింగ్ టైమ్.  అంటే ఆ సమయంలో కాల్ తీసుకోరు.  పోనీ ఫోన్ పెట్టేద్దామా అంటే ఏమో స్టూడియోకి దగ్గరగా వున్నానన్నాడుకదా.  నిజంగానే దగ్గరలోనే వున్నానేమో అనే మానవ సహజమైన ఆశ.  ఇటువంటి ప్రోగ్రామ్స్ కి ఎప్పుడూ ఫోన్  చెయ్యలేదుగా,  ఈ ఒక్కసారికీ దీని అంతు చూద్దామనుకున్నా.  నేనింత పట్టు వదలని విక్రమార్కడిలా ఫోన్ వదలకుండా కూర్చునేసరికి మా శ్రీవారికి కూడా సరదా వేసిందో ఏమో ఆయన సెల్ నుంచి ఆయనా చేశారు.  మరి ఆ రికార్డెడ్ డైలాగులన్నీ నాకు కంఠతా వచ్చేశాయి, ఆయనక్కూడా వస్తే, మాకు ప్రైజు వస్తే ఇద్దరంకలిసి సరదాగా అందరికీ ఆ డైలాగులు చెప్పచ్చులే అనుకున్నా. 

ఓ పక్కన మా ఫోన్ లో నానా సంభాషణలూ వింటూనే టీవీనీ గమనిస్తున్నా  ఎందుకైనా మంచిదని.  ఒకవేళ వేరే ఎవరికైనా ప్రైజు వస్తే నేను ఫోన్ పెట్టెయ్యచ్చుకదా, కనీసం నా ఫోన్ డబ్బులు మిగులుతాయని.  ఆ యాంకరేమో అసలు ఏ ఫోనూ రానట్లు పోజు  వైటింగ్ లో మా ఇంట్లోంచే రెండు ఫోన్లున్నాయి.  అలా ఇంకెంతమందో మరి.   ఏ ఫోన్ కీ కనెక్షన్ ఇవ్వకుండా ఎందుకలా చేసింది.  అంటే ... ఏమో ..   అన్నీ సందేహాలే.   ఫోన్ రింగ్ అవటం, హలో అనటం అరే డిస్ కనెక్టు అయిందే అని పైగా సిగ్నల్ వున్నచోటనుంచీ మాట్లాడండి అని ఓ ఉచిత సలహా.  సిగ్నల్ లేకపోతే రింగ్ ఎలా అవుతుందని నాలాంటి డౌటమ్మలకి డౌట్లొచ్చినా ఎవ్వరినీ ఏమీ అనలేంకదా.  సరేలెండి ఇన్ని చిత్ర హింసలు భరించి చివరికి తేలిందేమిటయ్యా అంటే నా ఫోన్లో 300 రూ. పైన వున్న బేలెన్స్ కాస్తా 16 రూ. కి వచ్చి నేను తిడతాననో ఏమో తనంతటతనే డిస్ కనెక్టు అయింది.  ఈ బుధ్ధి ముందే వుండచ్చుకదా అనుకున్నాను.  మావారు 110 రూ. కాగానే చూసుకోలేదు ఇంత వేస్ట్ చేశానని ఫోన్ కట్టేశారు. 

మొత్తానికి రాత్రి దగ్గర దగ్గర 12 గం. లదాకా ఆ యాంకరుగారు సుత్తి వేసీ, వేసీ, సగం సమాధానం ఒక కాలర్ చెప్తే ఇంకో సగం లో సగం తను చెప్పి అక్కడికి ప్రేక్షక మహాశయులంతా ఆ మాత్రం మొగాస్టార్ ని కూడా కనుక్కోలేని పామరులుగా భావించి చివరికి ప్రోగ్రామ్ ముగించబోయేముందు ఒక కాలర్ చేత చిరంజీవి పేరు చెప్పించుకుని ప్రోగ్రామ్ ముగించింది.

ఈ కార్యక్రమాల్లో ఎన్ని సవ్యంగా జరుగుతున్నాయో నాకు తెలియదుగానీ, ఇవాళ నేను నేర్చుకున్న నీతి నాలాంటి ఔత్సాహికులకు వెంటనే చెప్పాలనిపించింది.  పురుషుడు పుట్టిన ఇన్నాళ్ళకు యజ్ఞం చేశాడని తెలుగులో ఒక సామెత.  మేమేదో ఇన్నేళ్ళకు తీరిగ్గా కూర్చుని తోచీ తోచక చేసిన పనితో నష్టం 400 రూ.  అంతే కాదు రేప్పొద్దున్న ఎవరికి ఫోన్ చెయ్యాలన్నా ముందు రీఛార్జ్ చేయించుకోవటానికి పరిగెత్తాలి.

రోజూ ఆ సమయానికి నిద్ర పోతాను.  అలా నిద్రపోక టీవీ ముందు కూర్చోవటంవల్ల ఇప్పుడు వెంటనే నిద్ర పట్టకపోవటం, రేపు ఆలస్యంగా లేవటం సరే, నిద్రలో దీనికి సంబంధించిన కలలు రాకుండా వుండాలంటే ముందు ఆంజనేయ దండకం వగైరాలు చదువుకోవాలికదా.  వుంటా మరి.

అన్నట్లు మీరంతా మాంఛివాళ్ళు, ఇలాంటి వ్యసనాల జోలికి వెళ్ళని వాళ్ళని నాకు తెలుసుగానీ సలహా చెప్పకపోతే మరి నా మనసు శాంతించాలికదా.  మీ ఫోన్ లో బాగా బేలెన్స్ వుండీ, మీకు టైమ్ పాస్ కాకపోతే ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్రసారం చేస్తున్న ఛానల్స్ ఎన్నో వున్నాయి.  సరదాగా ఎంజాయ్ చెయ్యండి.  అనవసరంగా డబ్బులు దండగ చెయ్యకూడదనుకుంటే ఈ వ్యసనం జోలికి వెళ్ళకండి.  నిజంగా ఇది పేకాట, తాగుడు లాంటి వ్యసనమే.  ఎంతమంది ఆశతో ఇలాంటి ఫోన్లమీద ఎంతెంత డబ్బు వృధా చేస్తున్నారో కదా.  వీటితో బాగుపడుతున్నవాళ్ళు వ్యాపారస్తులు మాత్రమే.

1 comments

Friday, October 29, 2010

ఆడవారు జుట్టు విరబోసుకుని వుండకూడదా?

Friday, October 29, 2010



ఇదేం ప్రశ్న?  ఇప్పుడు ఎక్కడ చూసినా కనబడుతున్నదే అదికదా అంటారా?  నిజమే మరి.  జడవేసుకొమ్మంటే అమ్మాయిలకి పెద్ద అవమానం.  పల్లెటూరి గబ్బిలాయిలాగా ఏమిటంటారు.  శాస్త్రాలు, ఆధ్యాత్మిక గ్రంధాలు జుట్టు విరబోసుకోకూడదంటున్నాయి.  మనకి కనిపించని ఎన్నో భూత ప్రేత పిశాచాలు, దుష్టశక్తులు జుట్టుని ఆవహించే అవకాశంవుంది.  దానితో అలా విరబోసుకుని తిరిగేవారిలో, వారికే తెలియని అనేక మార్పులు సంభవిస్తాయి.   ముఖ్యంగా సాయంసమయంలో ఎన్నో దుష్ట శక్తులు ఆవహించే అవకాశం వుంది కనుక అసలు విరబోసుకుని వుండకూడదు.

 పురాణాలలో కూడా శపధం చేసినవారు, భర్త చనిపోయిన వారు, దుఃఖసాగరంలో మునిగినవారుఅలా విరబోసుకున్నట్లు చెప్పబడింది.  ఉదాహరణకి ద్రౌపది, కైక వగైరా. 

సైన్సు ప్రకారంకూడా అన్ని సమయాలలో జుట్టు విరబోసుకోకూడదు.  డాక్టర్లు ఆపరేషన్ చేసే సమయంలో జుట్టు ముడి వేసుకుని దాన్ని దేనితోనన్నా బంధించాలి.  ఆపరేషన్ ధియేటర్ లో జుట్టు పూర్తిగా కవర్ చేసుకుని వుండాలి.  జుట్టుకి రాలే గుణం వుంది.  ఆపరేషన్ ధియేటర్ లో జుట్టు రాలితే ఒక్కోసారి రోగికి ప్రాణాపాయంకూడా జరగవచ్చు. 

వంటచేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు తినే పదార్ధాలలో పడితే చాలా ప్రమాదం.   అలాగే దేవాలయాలలో పడితే వాటిని అపవిత్రం చేసినవాళ్ళమవుతాము.  మహా దోషం. 

పూర్వకాలంలో మనషుల స్ధాయినిబట్టి, ఎన్నోరకాల కేశాలంకరణలు చేసేవాళ్ళు.  మరి ఇప్పటి మన హైర్ స్టైలిస్ట్స్ కి అలాంటి విద్యలేమీ తెలియవా, పాపం మనవాళ్ళు ఏ సందర్భానికైనా విరబోసుకోవటమే ఫ్యాషన్ అనుకుంటున్నారు

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)



0 comments

Sunday, October 17, 2010

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో

Sunday, October 17, 2010


దసరా నవరాత్రి  ఉత్సవాలలో బతుకమ్మని ఆటపాటలతో కొలవటం  తెలంగాణావారి సంప్రదాయం.  కేవలం తెలంగాణావాసులేకాదు, ఇతర ప్రాంతాలలో  కూడా కొందరు ఈ ఉత్సవం చేస్తారు. 

భాద్రపద బహుళ అమావాస్య రోజున బతుకమ్మనిపెట్టి నవరాత్రులు తొమ్మిది రోజులూ అమ్మవారిని కొలుస్తారు.  మన పూర్వీకులు పాటించిన ఆచార వ్యవహారాలకు, మన పండగలకు, వాతావరణ మార్పులకు అవినాభావ సంబంధం వుంది.  ఆశ్వీయుజ మాసంలో వాతావరణ మార్పులవల్ల ఎవరైనా తొందరగా అనారోగ్య ప్రభావానికి గురి అయ్యే అవకాశం వున్నది.  అలా అనారోగ్య ప్రభావానికి లోనుకాకుండా, ముఖ్యంగా సుకుమారులైన స్త్రీల ఆరోగ్య పరిరక్షణకు ఏర్పరచిన ఉత్సవమిది.  ఔషధ గుణాలుకల తంగేడు, మోదుగ, మొదలగు అనేక రకాల పువ్వులను పేర్చి, పైన గౌరీ దేవిని పెట్టి పూజిస్తారు.  ఈ పూవులనుంచి వచ్చే ఔషధ గుణాలుకల  సువాసనలవలన అనేక రోగాలు నివారింపబడతాయి.

ఇప్పుడైతే ఈ పువ్వులను చాలా చోట్ల మార్కెట్ లో కొనుక్కుంటున్నారు కానీ పూర్వం చుట్టపక్కలవున్న చెట్లనుంచి ఈ పువ్వులను సేకరించేవారు.  తోటల్లో, చెట్లమధ్య, తోటివారితో కలిసి పువ్వులు సేకరిస్తుంటే అతివల మనసులు ఆనంద భరితమై మనసుకి ప్రశాంతత చేకూరేది. 

సాయంకాలం అందరూ ఒకచోట చేరికలిసి పాడుతూ బతుకమ్మలచుట్టూ చేరి ఆడుతుంటే ఆ స్త్రీలలో ఎనలేని ఉత్సాహం సమకూరుతుంది.  ఆరోగ్యపరంగానే కాదు సామాజికంగా అందరూ ఒకచోట చేరి, కలిసి మెలిసి వుండటానికి అవకాశమున్న ఈ బతుకమ్మ పండుగ పాటల సాహిత్యం ఏ రచయితో రాసినది కాదు.  జీవితంలో ఎదుర్కొనే ఆటుపోట్లనుంచి, అనుభవాలనుంచి ఉద్భవించినదే.  జీవితంలో ఎదుర్కొనే ఎన్నో ఒడుదుడుకులు, వాటినధిగమించి తమ జీవితాలని ఎలా చక్కదిద్దుకోవాలనే జీవిత సత్యాలే  ఈ బతుకమ్మ పాటలుగా రూపొందాయి.  

స్త్రీలని పువ్వులతో పోలుస్తారు.  సున్నిత మనస్కులైన వారి జీవితాలు  పూవులలాగే  సుగంధాలు వెదజల్లుతూ వారు సంతోషంగా  వుండి వారి కుటుంబంలో వారి జీవితాలు కూడా సంతోషమయం చెయ్యాలని వారిని చల్లగా బతుకమ్మా అని అశీర్వదిస్తూ చేసే ఈ వేడుకలు నవరాత్రుల సమయంలోనే చెయ్యటంలో ఇంకో అర్ధంకూడా వున్నది.  స్త్రీ పువ్వులా సుకుమారంగా వుండటమేకాదు, అవసరమైతే ఆదిశక్తిలా దుష్టులను దునుమాడాలి... ఆపద సమయంలో  శక్తి, యుక్తులు ప్రదర్శించి విజయం సాధించాలి.

ఆరోగ్యపరంగా, సామాజికంగానేకాక, జీవిత సత్యాలను నేర్పే  ఈ బతుకమ్మ వేడుకలు మా శ్రీ కృష్ణా నగర్ లో కూడా మైత్రీ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీమతి మల్లీశ్వరిగారి ఆధ్వర్యంలో చాలా సందడిగా జరిగాయి.  ఆ ఫోటోలు మీరూ చూడండి.




0 comments

Thursday, October 7, 2010

దేవీ నవరాత్రులలో అమ్మవారి నైవేద్యాలు

Thursday, October 7, 2010


మొదటి రోజు      --    పాడ్యమి       --   కట్టు పొంగలి, లేదా పులగం

రెండవ రోజు        --    విదియ        --   పులిహోర

మూడవ రోజు      --     తదియ       --  కొబ్బరి పాయసం లేదా కొబ్బరి అన్నం

నాల్గవ రోజు         --     చవితి         --    చిల్లులేని గారెలు లేదా మినప సున్ని వుండలు

ఐదవ రోజు          --    పంచమి     --     దద్దోజనం లేదా పెరుగు గారెలు

ఆరవ రోజు           --      షష్టి          --     కేసరి బాత్ లేదా పెసరపప్పు పునుగులు

ఏడవ రోజు           --      సప్తమి      --      శాకాన్నం లేదా కలగూర పులుసు అన్నం

ఎనిమిదవ రోజు      --       అష్టమి     --      చక్కెర పొంగలి లేదా బెల్లంతో పాయసం

తొమ్మిదవ రోజు      --       నవమి      --      క్షీరాన్నం లేదా పాల హల్వా

పదవ రోజు            --       దశమి      --      పులిహోర మరియు లడ్లు     


ఈనైవేద్యాలుగానీ, అమ్మవారి అవతారాలుగానీ కొన్ని వర్గాలవారి మధ్య కొంచెం తేడాలుంటాయి.  అందుకని కొత్తగా చేసేవారు ఏది చెయ్యాలి అని కంగారు పడకుండా వారి ఇంట్లో పధ్ధతి ప్రకారం చేసుకోవటం ఉత్తమం.  అది తెలియదనుకోండి, మీకు ఇబ్బంది లేకుండా, వున్న సమయమంతా ప్రసాదాలు తయారుచెయ్యటంతో గడపకుండా, మీరు ఏది చెయ్యగలిగితే అదే చెయ్యండి.  అమ్మవారు ఏదైనా స్వీకరిస్తుంది.  పూజలో భక్తే ముఖ్యం.

కొందరు ఇవన్నీ పట్టించుకోకుండా ఒక స్వీటు, ఒక హాటు అని చేసుకుంటారు.  కొందరు అమ్మవారు ఉగ్ర రూపిణి, అందుకని ఆవిడని శాంతపరిచే పదార్ధాలే చెయ్యాలని స్వీట్సే చేస్తారు. కొందరు ఉదయంనుంచి ఉపవాసం వుండి రాత్రికి పూజ అయ్యాక భోజనం చేస్తారు.  అలా వుండలేనివారు ఉదయం భోజనం చేస్తారు.   

భగవంతుడు భక్తితో చేసిన ఏ పూజ అయినా, మనస్పూర్తిగా పెట్టిన ఏ నైవేద్యమైనా స్వీకరిస్తాడు.  అందుకని ఎవరికి వీలైన పధ్ధతిలో వారు అమ్మవారిని సేవించి తరించండి.

అందరికీ దసరా శుభాకాంక్షలు.



0 comments

మహాలయ అమావాస్య విశేషమేమిటి? ఆ రోజు నిర్వహించాల్సిన కార్యక్రమాలు ఏమిటి?



భాద్రపద బహుళ అమావాస్యని మహాలయ అమావాస్య అంటారు.  చనిపోయినవారందరి స్మృతికోసం చేసే ఈ అమావాస్యను సర్వ పితృ అమావాస్య అని కూడా అంటారు.  చనిపోయిన తమ పెద్దల జ్ఞాపకార్ధం ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ వర్గం వారైనా పాటించే  కార్యక్రమం ఇది.   ప్రపంచ వ్యాప్తంగా అందరికీ ఈ పితృ స్మరణ రోజు ప్రత్యేకంగావున్నది.  క్రిస్టియన్స్ ఆల్ ఫాదర్స్ డే రోజున ఈ కార్యక్రమం చేస్తారు..   ఒక్కో సంవత్సరంలో ఒక్కో నెలలో, ఒక్కో రోజు వస్తుంది ఈ ఆల్ ఫాదర్స్ డే.  అలాగే ముస్లిమ్స్ మొహరం పాటిస్తారు.  హిందువులు తర్పణలు వదులుతారు.  కొందరు పెద్దలకి బియ్యమిస్తారు.

ఏ జాతి వారైనా, ఏ కులం వారైనా, వాళ్ళెక్కడవున్నా, వారి వారి సంప్రదాయాన్నిబట్టి, ఇంటి ఆచారాల్నిబట్టి,    వాళ్ల వాళ్ల అనుకూలతనుబట్టి పితృ దేవతలను సంస్మరించుకునే రోజు ఇది.  లేకపోతే రౌరవాది నరకాలకి పోతారంటారు.  ఈ కార్యక్రమంలో కేవలం చనిపోయిన తండ్రి, తల్లులనే కాదు వారి ముందు ఇంకో రెండు తరాల వారిని కూడా సంస్మరిస్తారు అంటే తండ్రి, తాత (తండ్రి తండ్రి), ముత్తాత (తాత తండ్రి), అలాగే తల్లి, నానమ్మ (తల్లి అత్తగారు), ఆవిడ అత్తగారు. 


ఇంక ఆరోజు నిర్వహించవలసిన కార్యక్రమాల గురించి శాస్త్రాల్లో వివరించారు ప్రత్యామ్నాయాలతోసహా.  వారి వారి ఆచారాలూ, పధ్ధతుల ప్రకారం విధి విధానంగా వాటిని పాటించటం ఉత్కృష్టం.  ఆ రోజు  పెద్దలకు తర్పణలు వదలాలి.  వారిని తలచుకుని బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి.  అలాగే పేదలకు అన్నదానం చేయాలి.  వీలుకానివారు ఇద్దరు వ్యక్తులకు భోజనం తయారు చేసుకోవటానికి సరిపడే అన్ని వస్తువులూ, బియ్యం, ఉప్పు, పప్పు, కూరలు,  నూనెతో సహా అన్నీ పెద్దల పేరు తలచుకుంటూ ఉచితమైన వ్యక్తులకి ఇవ్వాలి.    వారి పేరున శక్తి కొలదీ దాన ధర్మాలు చెయ్యాలి.

ఈ రోజుల్లో బ్రతికివున్న తల్లిదండ్రులనే పట్టించుకోని సంతానం, వారిని పలకరించటానికి కూడా తీరికలేని సంతానం చాలామందే వున్నారు.  వారంతా తమని తమ తల్లిదండ్రులు ఎంత ప్రేమతో పెంచారో అంతకన్నా ఎక్కువ ప్రేమ, ఆప్యాయతలు వారి వృధ్ధాప్యంలో వారిపట్ల చూపించాలి.  అలాగే వారి తదనంతరం వారు పోయిన రోజేకాక ఈ మహాలయ అమావాస్యనాడుకూడా, వారి వారి ఆచారాల ప్రకారం, వారి ఇంటి పధ్ధతుల ప్రకారం తల్లి దండ్రులను స్మరించుకోవాలి.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)

0 comments

Wednesday, September 29, 2010

రావి చెట్టు ఇంట్లో పెరగకూడదా?

Wednesday, September 29, 2010


 రావిచెట్టుని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.  విష్ణుస్వరూపమనీ, శని దోషాలు పోగొడుతుందనీ, ఆలయాల్లో ప్రదక్షిణలు కూడా చేస్తారు.  అలాంటి పవిత్రమైన వృక్షం ఇంట్లో మొలిస్తే కీడు జరుగుతుందని పీకేస్తారు.  ఇదెంతమటుకు సమంజసం?  

అసలు నిజమేమిటంటే రావిచెట్టు ఇంట్లో మొలవటంవల్ల ఎలాంటి దోషమూ లేదు.  అయితే ఆ చెట్టు చాలా కాలం వుంటుంది.  పెద్ద చెట్టవ్వటంవల్ల వేళ్ళు బలంగా భూమిలోపలదాకా చాలా దూరం పాకుతాయి.  దానితో మన ఇంటి పునాదులు, గోడలే కాక చుట్టుపక్కల ఇళ్ళకి కూడా నష్టం కలగవచ్చు.  కొన్ని సార్లు ఇళ్ళు కూలిపోయేదాకా కూడా వెళ్ళవచ్చు.

పెద్ద వృక్షాలుకనుక సహజంగా పక్షులు గూళ్ళుకట్టి గుడ్లు పెడతాయి.  వాటికోసం కొన్నిసార్లు పాములు రావచ్చు.  ఆ పక్షులు, పాములు ఇంట్లోకి రావటం ఇబ్బందే కదా.  కొన్నిచోట్ల కొమ్మలు కరెంటు తీగెలకి అడ్డు రావచ్చు, విరిగి ఎవరిమీదయినా పడవచ్చు.  అందుకే రావిచెట్టేకాదు, ఏ పెద్ద చెట్టయినా ఇంట్లో పెరగటం అంత మంచిది కాదు.

అయితే రావి చెట్టు సాక్షాత్తూ విష్ణు స్వరూపమంటారు, పైగా ఆ చెట్టు గాలి కూడా చాలా మంచిది కనుక దాన్ని పీకి పెంట కుప్పమీద పారెయ్యకుండా, వీలయితే ఎక్కడన్నా విశాలమైన ఆవరణలో పాతి పెట్టటానికి ప్రయత్నించండి.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)



0 comments

Friday, September 24, 2010

నవగ్రహాలు - వాటికి సంబంధించిన ధాన్యాలు

Friday, September 24, 2010



జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహానికీ వాటికి సంబంధించిన ధాన్యాలున్నాయి.  ఎవరికైనా జాతక చక్రంలో దోషాలేవైనా వున్నా, గ్రహ దోషాలవల్ల అనారోగ్యంపాలయినా,  ఆ గ్రహాలకి సంబంధించిన ధాన్యాలను దానం చెయ్యటం, తినటం వల్ల ఆ దోషాలు పోతాయని, స్వస్ధత చేకూరుతుందనీ అంటారు.  అవేమిటో చూద్దామా

రవి         --          గోధుమలు

చంద్రుడు   --          బియ్యం

కుజుడు     --          కందులు

బుధుడు    --          పెసలు

గురువు     --          శనగలు

శుక్రుడు     --          బొబ్బర్లు

శని           --          నువ్వులు

రాహువు    --           మినుములు

కేతువు      --           ఉలవలు    


5 comments

Wednesday, September 22, 2010

సఖి – ఈ టీవీ 2 కార్యక్రమం

Wednesday, September 22, 2010



అక్టోబర్ 1 వ తారీకు సీనియర్ సిటిజన్స్ డే ట.  ఈటీవీ-2 సఖి కోసం ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాము, తప్పకుండా రండి అని డైరెక్టరు శ్రీమతి ఐ..వి. రమాదేవి గారి ఆహ్వానం మేరకు 20-9-10 న కార్ఖానా లోని శ్రీమతి లక్ష్మిగారింటికి వెళ్ళాము నేనూ, శ్రీమతి మాలా కుమార్.  రమాదేవిగారి ఉద్దేశ్యం ప్రస్తుతం సీనియర్ సిటిజన్స్ చాలా అర్ధవంతంగా జీవితాన్ని గడుపుతున్నారని, తమ తీరిక సమయాన్ని చక్కగా వినియోగించుకుంటున్నారనీ, యువత వీరిని చూసి స్ఫూర్తి పొందాలని.

మేము వెళ్ళేసరికి అక్కడ పదిమందిదాకా మహిళలున్నారు.  అందరూ ఈ వయసులో ఉత్సాహంగా తమ జీవితాలనీ, సమయాన్నీ సద్వినియోగం చేసుకుంటున్నవాళ్ళే...అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  నేను, మాలాకుమార్, రమాదేవి తప్ప మిగతా అంతా మాకు కొత్త.  అయినా ఎంతో  ఆత్మీయుల్లా పరస్పరం పరిచయాలు, అడ్రసులు, ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకోవటాలు,  తమ తమ కార్యక్రమాల గురించి చర్చలు.  ఉదయం 10-30 కి వెళ్తే మధ్యాహ్నం 1 గం. దాకా సమావేశం, టీవీ కార్యక్రమం చిత్రీకరణ అయ్యాక సమీపంలోని శ్రీమతి మాలాకుమార్ ఇంటికి వెళ్ళి తిరిగి ఇళ్ళకి చేరాము.

ఈ కార్యక్రమం అక్టోబర్ 1 వ తారీకు మధ్యాహ్నం ఈటీవీ 2 ప్రసారం చేసే సఖి కార్యక్రమం లో వస్తుంది.  మధ్యాహ్నం 2 గం. ల నుంచీ 3 గం. ల దాకా ఆ కార్యక్రమం ప్రసారమవుతుంది.  అందులో ఒక పది నిముషాలు మా కార్యక్రమం వస్తుంది.  అవకాశం వున్నవారు తప్పక చూడండి.

ఈ కార్యక్రమానికి శ్రీమతి హైమా శ్రీ గారు ఏంకర్ గా వ్యవహరించి తన ప్రతిభని కనబరిచారు.
డైరెక్టర్ శ్రీమతి రమాదేవి, యాంకర్ శ్రీమతి హైమ శ్రీ తో పాల్గొన్న బృందం
  
షూటింగ్
డైరెక్షన్ చేస్తూ శ్రీమతి రమాదేవి
 షూట్ చేస్తూ కెమేరామేన్ శ్రీ రమేష్

5 comments

Thursday, September 16, 2010

మంత్రాలను బహిరంగంగా ఉపదేశించవచ్చా?

Thursday, September 16, 2010

 
 మంత్రాలు గురు ముఖంగా ఉపదేశింపబడాలంటారు, అదీ రహస్యంగా.  పైగా గురువు కొన్నాళ్ళు శిష్యులను పరీక్షించి వారు దానికి అర్హులు,  సరిగ్గా చెయ్యగలరు అని తెలిశాక ఇస్తారు అంటారు.  మరి ఈ మధ్య శాస్త్రవేత్తలు, ప్రముఖ గురువులు, అనేకమంది పెద్దలు మంత్రాలను బహిరంగంగా సభల్లోకూడా ఉపదేశిస్తున్నారు.  ఇలా చెయ్యవచ్చా అని చాలామందికి సందేహాలు వస్తున్నాయి.

మంత్రాలలో అనేక రకాలు.  వాటిని  కొన్ని వర్గాలుగా విభజించారు.  ఉదా... శాంతీకరణ మంత్రాలు, వశీకరణ మంత్రాలు, మోక్ష మంత్రాలు.  ఇందులో శాంతి మంత్రాలలో ఎక్కడా తీవ్రత వుండదు.  పొరపాటున ఉఛ్ఛారణ దోషాలొచ్చినా చేసేవారికి ఎలాంటి హానీ జరగదు.  సాధారణంగా ఇవి పెళ్ళి కావటం కోసం, ఆరోగ్యం కోసం ఇలా వుంటాయి.  పెళ్ళి కావటం కోసం జపం చేసే మంత్రం వల్ల అది చేసిన వాళ్ళకి లాభం వుంటుంది.  మిగతావారు వినటం వలన వీరికి కలిగే హాని ఏమీ లేదు.  ఒకవేళ ఇంకెవరికైనా కావాలన్నా వారుకూడా చేసుకోవచ్చు.  అలాగే ఆరోగ్యం కోసం చేసే మంత్రాలు బహిరంగంగా చెప్పటంవల్ల అందరికీ ఆరోగ్యం కలగాలని కోరుకోవటం జరుగుతుంది.  దీనిని విని కావాలసినవారు జపం చేసుకోవటంవల్ల వారందరికీ ఆరోగ్యం చేకూరుతుంది, దానివల్ల ఎవరికీ నష్టంలేకపోగా సమాజ శ్రేయస్సు జరుగుతుంది.  పైగా వీటిని బహిరంగంగా చెప్పటంవల్ల వీటి గురించి తెలియనివారుకూడా  తెలుసుకుని ఆచరించే అవకాశం వుంటుంది.  అందుకని ఇలాంటివాటిని బహిరంగంగా సభల్లో చెప్పటంవల్ల ఎవరికీ ఏ హానీ జరగదు, ఎలాంటి దోషం వుండదు పైగా ఎక్కువమందికి మంచి జరిగే అవకాశంవుంది.

కొన్ని మంత్రాలుంటాయి.  ఉదాహరణకి మోక్ష మంత్రం.  ఈ మంత్రం ఉపదేశించిన తర్వాత శిష్యుడు సరిగా చెయ్యకపోతే గురువుకి హాని జరుగుతుంది.  అందుకే గురువు శిష్యుని అనేక విధాల పరీక్షించిన తర్వాతే  ఉపదేశించబడతాయి,  అదీ బహిరంగంగా కాదు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)


0 comments

Monday, September 13, 2010

పక్షి పూజ ఎందుకు చెయ్యాలి?

Monday, September 13, 2010



పక్షి పూజ చెయ్యటమంటే పక్షులను తెచ్చి, పసుపు కుంకాలు, పూలు పెట్టి పూజ చెయ్యమని అర్ధం కాదు.  భూత దయ కలిగి వుండటం.  మన శాస్త్రాలు భూత యజ్ఞం చెయ్యాలని చెప్తాయి.  అంటే సర్వ ప్రాణులయందు దయ కలిగి వుండాలి.  వాటికి ఆహారాన్ని ఇవ్వాలి అని.  అందుకే భోజనం చేసేముందు ప్రతి వ్యక్తీ,  ప్రతి రోజూ ఎంగిలి చెయ్యకముందు ఒక ముద్ద పక్షుల కోసం బయట పెట్టి రావాలి.

వ్యవసాయ ప్రాధాన్యంగల ప్రాంతాల్లో, పంట వచ్చాక, అది ఏ పంటైనా, గుత్తులుగా గుచ్చి ఇంటి ముందు కడతారు.  అలా చెయ్యటం తోరణాలకోసమో, అందానికో కాదు.  పక్షుల కోసం.  కొంతమంది గుడికెళ్ళి మొక్కుకుంటారు.  పంట బాగా వస్తే దేవాలయంలో పక్షులకి ఆహారం పెడతామని.  అదే విధంగా పంట వచ్చాక దేవాలయంలో గుత్తులుగా ధాన్యంతో సహా కంకులు తోరణాల్లా కడతారు.

ఇలా ఇళ్ళల్లో, దేవాలయాల్లో కంకులు కట్టటం వల్ల తెలియక చేసిన దోషాలన్నీ పోతాయనీ, సిరి సంపదలతో సుఖంగా వుంటారనీ నమ్మకం.

కొన్ని చోట్ల కఱ్ఱలు పాతి వాటికి కంకులు కడతారు.  అనీ పక్షుల కోసమే.  కొందరు, ఆకులో వండిన అన్నం పెట్టి, రంగులు వేసి వీధి కూడలిలో పెట్టి దానిని పక్షులు తిన్నాయో లేదో గమనిస్తారు.  దానిని పక్షులు తింటే తమ కుటుంబంలో అందరూ సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో తులతూగుతారని విశ్వసిస్తారు. 

సర్వ ప్రాణులయందు దయ కలిగి వుండి, పక్షులకోసం ధాన్యాన్ని, అన్నాన్ని రోజూ పెట్టటంవల్ల తెలియక చేసిన దోషాలు పోయి, సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం.

(జీ తెలుగు ఇదివరకు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా.  నేనప్పుడు పోస్టు చెయ్యని వాటిలో ఉపయోగ పడేవాటిని కొన్నింటిని ఇప్పుడు పోస్టు చేస్తున్నా.)



0 comments

Wednesday, August 11, 2010

నరకం చూసొచ్చాను

Wednesday, August 11, 2010


 నిఝంగా నిజమండీ.  3 నెలలు నరకంలో వుండి ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నా.  పాపం అక్కడ నా గోల భరించలేక యమధర్మరాజుగారు త్వరగా పంపించారనీ, లేకపోతే ఈతరహాలో నరకానికి వెళ్ళేవాళ్ళు ఏళ్ళ తరబడి అక్కడే వుంటారనీ కొందరి ఉవాచ.  ఏమిటీ అర్ధంకాని గోల సరిగ్గా అఘోరించు అంటారా 

3 నెలలుగా కాళ్ళు నేలమీద పెట్టాలంటే నిప్పులమీద పెట్టినట్లు భరించలేని మంటలు,  కన్ను మూసి తెరిచేలోగా అరికాళ్ళల్లో,  పక్కలనా అంగుళం పైన పగుళ్లు, చాలా లోతుగా, కొన్ని రక్తం కారుతూ, ఎలా వస్తున్నాయో తెలియదు, ఎందుకు వస్తున్నాయో తెలియదు.  పాదాలలో కాలిన బొబ్బల్లా రావటం, అవి పగలటం.  ఎంత భయంకరమో అనుభవిస్తేనే తెలుస్తుంది.  అడుగు తీసి అడుగు వెయ్యలేను.  ఇదే సమయంలో శ్రీవారికి మీటిగుల హడావిడి.  పగలంతా ఇంట్లో ఒక్కదాన్ని.  ఎవరొచ్చినా తలుపు తియ్యాలన్నా నా నరక బాధలు నాకన్నా ముందు రెడీ. 

పాదాలు చాలవన్నట్లు ఆ పగుళ్ళు అరి చేతుల్లోనూ రావటం మొదలయ్యాయి.  ఏమీ పట్టుకోలేను, తిన లేను, ఏ పనీ చెయ్యలేను.   పదేళ్ళనుంచీ ఇంగ్లీషు మందు వాడటంలేదు.  హెర్బల్ మెడిసన్ శ్రీ యోగానంద్ గారి దగ్గరే.  ముందు మామూలు పగుళ్ళే అని అశ్రధ్ధ చేసి దాదాపు నెల తర్వాత ఆయన దగ్గరే మందు వాడటం మొదలు పెట్టాను. 

మందు మరగ కాచి, దానిలో వేరే పదార్ధాలు కలిపి రోజుకు నాలుగు సార్లు తీసుకోవాలి.  పై పూతకి వేరే మందు నువ్వుల  నూనె లో కలిపి రాయాలి.  ఆ నూనె, మందు, బాధ చికాకుతో కాళ్ళు ఇంకో కుర్చీలో జాపి అలాగే కూర్చునేదాన్ని.  ఏక్టివ్ గా తిరిగే దానికి రోజుల తరబడి అలా ఒకే చోట కదలకుండా వుండటంకన్నా నరకం వుంటుందా.  అందరి దిష్టికొట్టి ఇలా మూలనబడ్డానా అనే ఒక నమ్మలేని అనుమానం.

పగుళ్ళు తగ్గితే పాత అట్టముక్కల్లా చర్మం పెచ్చులూడి వచ్చేసేది.  ఇంతలో ఇంకో చోట పగుళ్ళు.  అరికాళ్ళల్లో పొట్టు లేచి పోవటం, ఎన్ని పొరల చర్మం వూడి పోయిందో.... ఇవీ సరిపోవని ఒళ్ళంతా రేష్, దురద.  అసలు మామూలు మనిషినవుతానా అని అనుమానం.  ఓహ్.  చెప్పటం చేత కావటంలేదు.  చాలా తక్కువ చెప్పాను.

పుండుమీద కారం జల్లినట్లు నెట్ లో చూస్తే ఇవి ఎందుకు వస్తున్నాయో తెలియదనీ, వస్తే తొందరగా తగ్గవనీ, మళ్ళీ మళ్ళీ వస్తాయనీ  తెలిసింది.  ఇంకో వార్త మా బంధువులలో ఒకరు 4 ఏళ్ళనించీ, ఇంకొకరు ఏడాది పైనుంచీ  ఈ బాధ పడుతున్నారనీ,  ఇంకా తగ్గలేదనీ, వాళ్ళు ఇంగ్లీషు మెడిసన్ వాడుతున్నారనీ తెలిసింది.  అందుకే ఒకసారి ఈ నరకంలోకి వెళ్ళినవాళ్ళు తొందరగా బయటకి రారని అన్నది.

నాకు శ్రీ యోగానంద్ గారి మీద వున్న నమ్మకం వల్ల నా అంతటనేను ఇంకొక డాక్టరు దగ్గరకు వెళ్ళలేదు.  నా బాధ తట్టుకోలేక నా శాయ శక్తులా ఆయన్ని హింసించాను.  నాలాంటివాళ్ళని ఎంతమందినో చూసుంటారాయన.  చలించలేదు.  తగ్గుతుంది అనే భరోసా మానలేదు.  అలాగే ఒక వారం రోజుల నుంచి మంటలు తగ్గటం మొదలయ్యాయి.  పగుళ్ళు కూడా తక్కువ లోతులో రావటం, తొందరగా తగ్గటం జరగుతోంది.  ఒంటినిండా వచ్చిన రేష్ పూర్తిగా తగ్గింది.  దాని మచ్చలు తగ్గాలి ఇంకా.

ఇవి ఒకసారి వస్తే మళ్ళీ మళ్ళీ వస్తూనే వుంటాయిట.  చూద్దాం మరి.  అసలు తగ్గటడం మొదలయింది కదా,  సాంతం తగ్గుతాయనే భరోసా శ్రీ యోగనంద్ గారిచ్చారయ్యే.   ఇంట్లో నడుస్తుంటే కొంచెం ధైర్యం వచ్చింది.  శ్రీమతి మాలా కుమార్ ఫోన్ చేసి మరీ ప్రమదావనం సందడి వినిపించి  స్ధైర్యాన్నిచ్చారు.  ఇంతకాలం కంప్యూటర్ తెరవాలన్నా విసుగనిపించింది.  కానీ ఇవాళ నా అవస్ధ అందరితో పంచుకోవాలనిపించింది.  అంటే నా బాధ చెప్పాలని కాదు.  ఎవరికైనా ఇలాంటి బాధ ఎదురయితే (ఇప్పుడు భగవంతుడు నాకు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే, ఈ బాధని ప్రపంచంలోంచే తీసెయ్యమని కోరుకుంటాను....కనుక ఎవరికీ ఇది రాకూడదు) అశ్రధ్ధ చెయ్యకుండా వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోండి. 

ముందు నాకు అర్జంటుగా తగ్గి, అంతకన్నా అర్జంటుగా నా యాత్రలు మొదలెట్టాలని  కోరుకోండి.

15 comments

Thursday, July 15, 2010

వాన కురిసిన రోజు

Thursday, July 15, 2010




కమ్ముకొస్తున్న మబ్బులు


మబ్బుల్లో పాపికొండలు
 గాలి వానలో, వాన నీటిలో కారు ప్రయాణం...
  గమ్యమెక్కడో తెలియదు పాపం....
 పాపం మూగజీవులు
 వాన కడిగిన ఊరు

7 comments