Friday, January 29, 2010

సుమంగళులు ఇంటికి వచ్చినప్పుడు మంగళ ద్రవ్యాలు ఇస్తారు. ఎందుకు?

Friday, January 29, 2010



భారతీయ సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వారిని తగు రీతిలో సత్కరిస్తారు.  పండగ పబ్బాలలో వచ్చేవారిని ఒక రీతిగా, ఇంట్లో జరిగే ప్రత్యేక కార్యక్రమాలకు వచ్చిన ఆహూతులకు ఒక విధంగా, ఇంటి ఆడబడుచులకూ, దగ్గరవారికీ, ఇలా ఆ సందర్భన్నీ, వారితో వున్న సంబంధాలనిబట్టి ఇంటికి వచ్చిన అతిధులను, ముఖ్యంగా సుమంగళులను.... వారికి పసుపు, కుంకుమ, చీరె, జాకెట్, పండు, తాంబూలం వగైరాలిచ్చి గౌరవించటం మన సంప్రదాయం. 

పూజ పూర్తయిన వెంటనే సుమంగళులు వస్తే, ముఖ్యంగా మంగళ, శుక్రు వారాలలో,  సాక్షాత్తు తాము కొలిచిన దేవత  వారి రూపంలో వచ్చిందని భావించి మంగళ ద్రవ్యాలు ఇస్తారు.  తీసుకున్నవారు కూడా ఇవాళ ఈవిడ నాకు బొట్టు పెట్టి ఇవి ఇచ్చింది, ఈవిడ సౌబాగ్యవతిగా సుఖ సంతోషాలతో వుండాలని ఆశీర్వదిస్తారు

ఎంత వున్నవారైనా రోజూ వచ్చిన వారందరికీ, బట్టలు వగైరాలు పెట్టలేక పోవచ్చు.  ఎంత పేద వారైనా, ఇంటికి వచ్చిన ముత్తయిదుకి బొట్టు పెట్టకుండా పంపించే వారిని మనం చూడం (ఈ మధ్య హడావిళ్ళల్లో, నాగరికతల్లో ఈ అలవాటు కొంచెం వెనకబడుతోంది).  అయితే దీనివల్ల ప్రయోజనం ఏమైనా వుందా అంటే వుంది.  అందరినీ దైవ స్వరూపంగా భావించి గౌరవించటం, ఆదరించటం వల్ల మన సంస్కారం పెరుగుతుంది, మన సంస్కృతీ సాంప్రదాయాల విలువలు పెరుగటమేకాక అందరికీ తెలుస్తాయి.  అలాగే సంఘీభావం, సమానత్వం, ఆత్మీయతలు
 బలపడతాయి. 

అయితే కొందరు దీని వెనకవున్న సామాజిక ప్రయోజనాన్ని గుర్తించక, తెలిసీ తెలియక కొన్నిసార్లు ఎదుటివారిని బాధ పెడుతున్నారు.  ముత్తయిదులతోపాటు  భర్త పోయినవారు, సంతానంలేని వారు, చిన్నపిల్లలు రావచ్చు.  కేవలం ముత్తయిదులకి పసుపు కుంకుమలు, పండు తాంబూలం ఇంచ్చి మిగిలినవారిని వదిలెయ్యకూడదు.  వారు నొచ్చుకునే అవకాశం వుంది.  ఇంటికి వచ్చినవారిని బాధ పెట్టటం మన వుద్దేశ్యం కాదుకదా.  అందుకే వారికీ అన్నీ ఇవ్వాలి.  భర్తలేని వారికి పసుపు కుంకుమలు ఇవ్వటం మీకు అభ్యంతరమైతే అందరితోబాటు వారికీ పళ్ళో, ప్రసాదమో ఏదో ఒకటి ఇవ్వండి.  కేవలం ముత్యయిదులకు మాత్రమే బొట్టుపెట్టి తాంబూలమిచ్చి మిగిలినవారిని అలా వదిలెయ్యకూడదు.  అలా చేస్తే పెద్దలు ఆశించిన సంఘీభావం లోపించటమేగాక మనం వారిని అవమానించినట్లవుతుంది.  ఇంటికి వచ్చిన అందరినీ ఆదరించటం మనం మర్చిపోకూడదు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)

మనలో మాట

భర్తలేనివారికి పసుపు కుంకుమలు (వారు తీసుకునేటట్లయితే) ఇవ్వటంలో తప్పులేదని నా అభిప్రాయం.  అవి పెళ్ళితో వచ్చిన చిహ్నాలు కాదు.  ఆడపిల్లలకు చిన్నప్పటినుంచే పసుపు కుంకుమలు పెడతారు.  పెళ్ళికాని వాళ్ళు పెట్టుకోకూడదని అడ్డుపడరు. 

ఇంకో విషయం మీరు గమనించారా  ఈ బిజీ కాలంలో శ్రావణ మంగళవారం వాయనాలు ఇంటికి వచ్చి ఇచ్చేస్తారు.  ఆ వాయనాలు లెక్క ప్రకారం తెచ్చుకుంటారు.  వెళ్ళిన ఇంట్లో ఇంకో ముత్తయిదు ఎక్కువవుంటే వారికి వాయనం ఇవ్వటం సంగతి తర్వాత చాలామంది కనీసం బొట్టు పెట్టరు.  అలాగే ఏ పెళ్ళికో పేరంటానికో పిలవటానికి వెళ్ళినప్పుడుకూడా అసలు వారికి తప్ప పక్కనున్న వారికి బొట్టు పెట్టరు.   ఇది కాదు మన సంస్కారం.  వారంతా మీకు తెలియకపోవచ్చు.  వాళ్ళందర్నీ మీరు మీ ఇంటికి పిలవనక్కరలేదు కూడా.   మనకి అపరిచితులయినా అలా పక్కవారికీ బొట్టుపెట్టి గౌరవించటం మన కనీస మర్యాద.  అలా బొట్టు పెట్టినంత మాత్రాన వాళ్ళంతా మనింటిమీద వచ్చిపడరు.


0 comments

అష్ట లక్ష్ములలో ధైర్య లక్ష్మిని ఎప్పుడూ వదలవద్దంటారు. ఎందుకు?


అసలు ధైర్యం అంటే?  అది ప్రత్యేకంగా వుండటమేమిటి?  దాన్ని వదలద్దనటమేమిటి?  ఏం ధైర్యంగా లేకపోతే మనిషి బ్రతకలేడా?  ఇలాంటి సందేహాలు కొందరికి రావచ్చు.  అన్నీ అనువుగా వుండి, భోగ భాగ్యాలతో తులతూగుతూ, జీవితంలో ఏ సమస్యా లేకుండా సంతోషంగా వున్నవాళ్ళు వీళ్ళు.  అలాంటి సందర్భలలో అందరూ ధైర్యంగానే వుంటారు.   నిజానికి ఆ సమయంలో ఆ వ్యక్తికి ధైర్యం వుందో, లేదో కూడా తెలియదు.  దాని అవసరమేమిటో తెలియదు.

కానీ సమస్యల సుడుగుండంలో చిక్కుకున్నవాళ్ళకి తెలుస్తుంది ధైర్యం విలువ, దాని అవసరం.  అలాంటి సమయంలో ఏ వ్యక్తయితే నిబ్బరంగా వుంటాడో, ఏ వ్యక్తయితే చిరునవ్వు వీడడో ఆ వ్యక్తి ధైర్యం కలవాడు అని చెప్పవచ్చు.  చెప్పటం సులభమేకానీ, ఆచరించటం  అంత సులభమేమీ కాదు.  అందుకే  ఏ మనిషయితే ఎన్ని చిక్కులొచ్చినప్పటికీ, ఎన్ని సమస్యలొచ్చినప్పటికీ ధైర్యంగా వుండి కార్యసాధన చెయ్యగలుగుతాడో, చిక్కులు పరిష్కరించుకలుగుతాడో ఆ వ్యక్తి ధైర్యం కలవాడు అన్నారు..అసలు ధైర్యం వున్నప్పుడే సరిగ్గా ఆలోచించి సమస్యలకి పరిష్కరం కూడా కనుక్కోగలుగుతాడు. అలాగే ఏ వ్యక్తయితే ఎప్పుడూ ధర్మాన్ని ఆచరిస్తాడో, ఏ వ్యక్తయితే ఇంద్రియాలని అదుపులో వుంచుకుంటాడో,  ఆ వ్యక్తి ఏ పరిస్ధితుల్లోనూ  ధైర్యాన్ని విడువడు.  ఆ వ్యక్తి గడిపే నిబధ్ధతాయుతమైన జీవితమే ఆ వ్యక్తియొక్క ధైర్యం అవుతుంది.

పురాణాల ప్రకారం కూడా ఒక కధ వుంది.  పూర్వం ఒక రాజు వుండేవాడు.  ఆయన ప్రజలని చక్కగా పరిపాలించేవాడు.  ఒకసారి శత్రు రాజులు చేసిన దాడిలో ఆ రాజు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు.  అష్టలక్ష్ములు ఒక్కొక్కళ్లూ ఆ రాజుని విడిచి వెళ్ళిపోయారు.  విజయలక్ష్మి, రాజ్య లక్ష్మి ఆయన్ని వదిలి వెళ్ళినా తలవంచుకుని వున్నాడేగానీ మారు మాట్లాడలేదు.  సంతాన లక్ష్మి  వెళ్ళి పోయింది.  రాజు సంతతంతా దూరమయ్యారు.  ధాన్య లక్ష్మి వెళ్ళటంతో ఆహారం సమస్య అయింది.  అలా అందరూ లక్ష్ములూ రాజుతో మేము వెళ్ళి పోతున్నాము అని చెప్పినా రాజు చేసేదేమీలేక తలవంచుకుని కూర్చున్నాడు.  చివరికి ధైర్య లక్ష్మి వచ్చి తనూ వెళ్ళిపోతున్నానని చెప్పింది.  అప్పుడు ఆ రాజు ఆమెకి నమస్కరించి అమ్మా, నువ్వెలా వెళ్తావు.  ధర్మమనే ధైర్యలక్ష్మి నా దగ్గర వుంది.  నువ్వెలా నన్నొదిలి వెళ్తావు అని ప్రశ్నించాడు.  ఆమె  రాజు ధార్మిక ప్రవర్తనకు సంతసించి ఆ రాజుతో వుండిపోయింది. 

ధైర్యం వుంటే తను తిరిగి చేసే ప్రయత్నాలవల్ల తన రాజ్యం తన దగ్గరకు వస్తుంది, తన సంతానం తన దగ్గరకు వస్తుంది, తను పోగొట్టుకున్న సకల సిరి సంపదలు, భోగ భాగ్యాలూ తన దగ్గరకు వస్తాయని, తను పోగొట్టుకున్న సకల సంపదలూ  తన దగ్గరకు వస్తాయని నమ్మాడు ఆ రాజు.  ఆ ధైర్యంతోనే ఆ రాజు అన్నీ సాధిస్తాడు.  దీనివల్ల అర్ధమయిందేమిటి.  ఎలాంటి సందర్భాలలోనైనా మనిషి ధైర్యం వదలకుండా వుంటే ఏదైనా సాధించవచ్చు.

ధైర్యం అంటే మొండిగా మనం చేసిందే సరైనదనటం కాదు.  తప్పు, చెడు, అధర్మాలకు దూరంగా వుండి, శాస్త్రాలు దేనిని ధర్మమని చెబుతున్నాయో దాన్ని ఆచరిస్తే ధైర్యలక్ష్మి ఆ వ్యక్తిని వదిలి వెళ్ళదు.  ఆ వ్యక్తి సాధించలేనిది ఏదీ లేదు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)

మనలో మాట

ారాంశమేమిటంటే మన జీవిత గమ్యంలో ఎన్ని చికాకులెదురయినా ధైర్యంగా వాటిని పరిష్కరించుకునే మార్గాలు వెతుక్కోవాలిగానీ నిరాశ చెంది బ్రతుకు బరువు చేసుకోకూడదు.స



3 comments

Thursday, January 28, 2010

చీమలకి ఆహారం వేయాలంటారు. ఎందుకు?

Thursday, January 28, 2010





మన సాంప్రదాయం ప్రకారం ప్రతి రోజూ, ప్రతి వ్యక్తీ దానం చెయ్యాలి అని చెప్తారు.  రోగ పీడితులు, గ్రహ పీడితులు, ఇంకా అందరూ.  పేదవాళ్ళకి, అవసరమైన వాళ్ళకీ దానం చేస్తే ఎంతో పుణ్యం రావటమేకాక మనం తెలిసీ తెలియక చేసిన పాపాలన్నీ కరిగి పోతాయి.  దానాలు షోడష  రకాలంటారు.  వీటిలో ముఖ్యంగా అన్నదానం చాలా గొప్పది.

అయితే అందరూ అన్నదానం చెయ్యగలరా?  ఎంత కష్ట పడ్డా వారి కుటుంబ అవసరాలు గడవటానికే ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది వున్నారు మన దేశంలో.  అలాంటివారు రోజూ అన్నదానమో ఇంకేదో దానమో చెయ్యాలంటే సాధ్యంకాదుకదా.  అయితే వీళ్ళకి కూడా సూక్ష్మంలో మోక్షం చెప్పింది శాస్త్రం.  బియ్యం పిండిలో చక్కెర లేదా బెల్లం కలిపి చీమలకు పెట్టాలి.  లేదా వుట్టి చక్కెర అయినా పెట్టవచ్చు.  ఇలా చేస్తే పదివేలమందికి అన్నదానం చేసిన పుణ్యం వస్తుంది.  ఇది ఇళ్ళల్లో, మనుషులు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో కాకుండా దూరంగా, చీమలుండే చోట పెట్టాలి.  కొందరు చెట్ల మొదట్లో చక్కెర జల్లుతారు...చీమలకోసమే.

తేనెను తమలపాకులోగానీ రావి ఆకులోగానీ పెట్టి సూర్యుడికి, తులసికి పూజ చేసి నైవేద్యం పెట్టి అక్కడే వదిలెయ్యవచ్చు.  దీనికీ విశేష ఫలితముంటుంది.  ఎందుకంటే తేనె ఎన్నో పువ్వులనుండి సేకరించబడుతుంది.  అమృత తుల్యమైంది.  దాన్ని చీమలకి పెడితే చాలా దోషాలు పరిహారమవుతాయి.

అయితే దానం చెయ్యగలిగిన వాళ్ళుకూడా ఒకసారి చీమలకి చక్కెర వేస్తే పదివేలమందికి అన్నం పెట్టిన పుణ్యం వస్తుందికదా, పదివేలమందికి అన్నం పెట్టి అంత ఖర్చు పెట్టటం ఎందుకు, సూక్ష్మంలో మోక్షంగా చీమలకి చక్కెర పెట్టేద్దామనుకోకూడదు.

ఈ విషయంలో పురాణ కధ కూడా ఒకటి వుంది.  పూర్వం చాలా పేద వ్యక్తి ఒకతను వుండేవాడు.  అతని దగ్గరకు ఒకసారి ఒకతను వచ్చి చెప్తాడు.   నువ్వేదయినా దానం చెయ్యి, అప్పుడు నీకూ సిరిసంపదలు వస్తాయి.  మనం దానం చెయ్యకుండా ఏమీ పొందలేము.  ఇప్పుడు మనమనుభవిస్తున్న ప్రతి ఒక్కటీ ఇదివరకు మనం దానం చేసినవే.  ఇదివరకు నువ్వేం దానం చెయ్యలేదేమో, అందుకే ఇలా వున్నావు.  ఇప్పుడేదైనా దానం చేసి ఈ దారిద్ర్యంనుంచి బయటపడమని సలహా ఇస్తాడు.

అప్పుడా నిరుపేద దానం చెయ్యటానికి నా దగ్గర ఏముంది?  ఏందానం చెయ్యను? అని బాధ పడతాడు.  అప్పుడా వచ్చిన వ్యక్తి ఎందుకు లేదు?  నీ పెరట్లో తోటకూర వుందికదా దానిని దానం చెయ్యి అంటాడు.  మిత్రుని మాట విని అతను అలాగే చేస్తాడు.  ఆ దానంతో సిరి సంపదలు కలిగి తరువాత జీవితమంతా హాయిగా వుంటాడు.  మరు జన్మలో అతను  ఒక దేశానికి రాజుగా జన్మిస్తాడు.  అంతేకాదు.  అతనికి పూర్వ జన్మ జ్ఞానం కూడా వుంటుంది.  పూర్వ జన్మలో తను చేసిన దానం వల్లకదా తనకింత సిరి సంపదలు వచ్చాయి అని ఈ జన్మలో కూడా అలాంటి దానం చేసి ఇంకా సిరి సంపదలు పొందాలనే వుద్దేశ్యంతో తన రాజ్యంలో అందర్నీ తోటకూర పెంచమని ఆజ్ఞ ఇస్తాడు.  అంతకు ఇంతయితే ఇంతకు ఎంత అనుకుంటూ (పూర్వ జన్మలో కొంచెం తోటకూర దానం ఇచ్చినందుకే అంత సిరి సంపదలు వస్తే ఇప్పుడు తన రాజ్యం మొత్తం తోటకూర పెంచి, దాన్నంతా దానం ఇస్తే, తనూ తన ప్రజలూ ఇంకెంత సిరి సంపదలతో తులతూగుతారో) ఆ తోటకూరంతా దానమివ్వటం మొదలు పెడతాడు.

ఒకసారి ఒక సన్యాసి ఆ రాజ్యానికి వస్తాడు.  రాజు సన్యాసికి సకల మర్యాదలు చేసి తన అనుమాన, అదే, అంతకు ఇంతయితే..ఇంతకు ఎంత?...అని అడుగుతాడు.  ఆ సన్యాసి, అంతకు ఇంతయితే ఇంతకు ఇంతే (శూన్యం అని అర్ధం వచ్చేటట్లు) చెప్తాడు.  రాజు నిర్ఘాంతపోతాడు.  అప్పుడా సన్యాసి చెప్తాడు...నీకు పూర్వ జన్మలో  ఏమీలేదు.  నిరుపేదవయిన నీవు నీ పెరట్లోని తోటకూర దానం చేసి ఎంతో పుణ్యం సంపాదించావు.  మరి ఈ జన్మలో నువ్వు సిరి సంపదలతో తులతూగుతున్నావు.  ఇంత సిరి సంపదలతో తులతూగే నువ్వు తోటకూరే దానం చేస్తానంటే ఫలితమేముంటుంది.  శక్తి లేని వాళ్ళు ఏమి దానం చేసినా అమిత ఫలాన్నిస్తుందికానీ, అన్నీ వుండి, దానం చేసే శక్తి కలవారు తమ శక్తికొద్దీ దానం చెయ్యాలి. అంతేకానీ చీమలకి చక్కెర వేస్తే పదివేలమందికి దానం చేసిన పుణ్యం వస్తుందని అత్యాశతో అలా చెయ్యకూడదు.  భూత దయతో, వాటికీ ఆహారం పెట్టే ఉద్దేశ్యంతో చెయ్యవచ్చు కానీ అల్ప దానంతో అనల్ప ఫలితాన్ని ఆశించకూడదు అని రాజుకి జ్ఞాన బోధ చేస్తాడు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)

మనలో మన మాట

మన పెద్దలు ఏది చెప్పినా చాలా ఆలోచించి చెప్పారనిపిస్తుంది కదా.   పరస్పర సహాయ, సహకారాలతో ఈ ప్రపంచం స్వర్గ తుల్యమవుతుందని గ్రహించిన వాళ్ళు, ఆ సహాయ సహకారాలను ప్రోత్సహించటానికి దాన ధర్మాలు, పుణ్యం ఇలాంటివన్నీ చెప్పారేమో.  ఆ మాత్రం స్వార్ధం లేకుండా (దానం చేస్తే వచ్చే పుణ్యం) మనుషుల్లో దాన గుణాన్ని పెంపొందింప చెయ్యటం కష్టమని వాళ్ళకూ తెలుసు.  అలాగే ప్రతివాళ్ళూ సూక్ష్మంలో మోక్షానికి పాకులాడకుండా వుండేందుకు కొన్ని కధలు కూడా.   ఏమంటారు?








0 comments

Wednesday, January 13, 2010

భోగి పళ్ళకి రేగు పళ్ళనే ఎందుకు పోస్తారు?

Wednesday, January 13, 2010




సంక్రాంతి పండగల్లో భోగి రోజున ఆంధ్ర ప్రదేశ్ లో ఏ ఇంట్లో పసిపిల్లలకు భోగి పళ్ళుపోసినా రేగు పళ్ళే పోస్తారు.  ఈ కాలంలో వచ్చే అనేక రకాల పళ్ళుండగా రేగు పళ్ళనే ఎందుకు వాడతారు?  వాటికి అంత విశేషం ఎందుకు?  వాటినే భోగి పళ్ళకి ఎందుకు వాడాలి?  రేగు పళ్ళని సంస్కృతంలో బదరీ ఫలాలంటారు.  పూర్వం నర నారాయణులు బదరీ వనంలో తపస్సు చేశారు.   అక్కడ తపస్సు చేసుకుంటూ వాళ్ళు రోజూ  చుట్టుపక్కలవున్న చెట్లనుంచి  ఒక్క రేగు పండుని ఆహారంగా తీసుకునే వాళ్లు.  సాక్షాత్తూ నారాయణుడు అక్కడ తిరుగుతూ,  రేగు పళ్ళని తింటూ, ఆ  ప్రదేశాల్నీ, వృక్షాలనీ, వనాన్నీ స్పృశించి ఆశీర్వదించారు.  ఆ ప్రదేశమే బదరీ క్షేత్రం.

బదరీ ఫలాలు నారాయణుడిచే స్పృశించబడి   సాక్షాత్తూ ఆ దేవ దేవుని ఆశీస్సులు పొందాయి కనుక ఆ పళ్ళను ఎవరు వాడినా సిరిసంపదలు, భోగ భాగ్యాలతో తులతూగుతారంటారు.  భోగినాడు పెద్దవారు పిల్లలకి భోగి పళ్ళుపోసి ఆశీర్వదిస్తారు.  వారి ఆశీర్వచనాలతోబాటు ఆ నారాయణుడి ఆశీస్సులు కూడా వారికి అందుతాయనే నమ్మకంతో.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)





4 comments

Tuesday, January 12, 2010

గ్రహణం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?

Tuesday, January 12, 2010




ఆధ్యాత్మికంగా గ్రహణం సమయానికి చాలా విశేషముంది.  గ్రహణం పట్టగానే స్నానం చేసి దీపారాధన చేసి జపం చేసుకుంటే విశేష ఫలితాన్నిస్తుంది.  ముఖ్యంగా నదీ స్నానం చేసి, నదీ తీరాన జపం చేసుకుంటే ఆ ఫలితం ఇంకా ఎక్కువ.

గ్రహణ సమయంలో దేవాలయాలన్నీ మూసేస్తారు కదా,  మరి జపం చెయ్యమంటున్నారు,      అసలు దేవాలయాల్ని ఎందుకు మూస్తారు అనే సంశయంకలగవచ్చు.  ఆగమ  శాస్త్రానుసారం గ్రహణ సమయంలో దేవాలయాల్ని మూసి, తర్వాత ప్రోక్షణ చేసి పూజలు ప్రారంభించాలి.  అందుకే దేవాలయాలు మూసివేస్తారు.

జపం చేసుకోమన్నారుకదాని ఇళ్ళల్లోకూడా దేవతా విగ్రహాలను, పటాలను తాకి పూలు పెట్టి పూజ చెయ్యకూడదు.  కేవలం మానసిక జపం మాత్రమే చెయ్యాలి.  గ్రహణం సమయంలో చేసే జపం మామూలుగా చేసే దానికన్నా అనేక రెట్లు ఎక్కువ ఫలితాన్నిస్తుందంటారు.  గ్రహణ సమయంలో ఆవు నెయ్యతో దీపారాధన చేసి, దాని ముందు కూర్చుని జపం చేస్తే, ఆ మంత్రంతో హోమం చేసినంత ఫలితాన్నిస్తుంది. ఏదైనా మంత్రం అక్షర లక్షలు చేసినప్పుడు మంత్రసిధ్ధి కలుగుతుంది.  అంటే మంత్రంలో ఎన్ని అక్షరాలు వున్నాయో (ముందునుంచి వెనుకకి, వెనకనుంచి ముందుకి) అన్న లక్షలసార్లు  ఆ మంత్రాన్ని శ్రధ్ధా భక్తులతో జపిస్తే మంత్రం సిధ్ధిస్తుందంటారు. 

అయితే అందరూ ఈ జపాలు చేయలేరు.  శారీరకంగా అశక్తులు వుండవచ్చు, ఉద్యోగరీత్యా, ఇంకా ఇతర పనులవల్ల కుదరకపోవచ్చు.  అలాంటివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమైనా వున్నాయా.  శాస్త్ర ప్రకారం సూర్య గ్రహణానికి 12 గం. ముందునుంచీ, చంద్ర గ్రహణానికి 9 గం.ల ముందునుంచీ కడుపు ఖాళీగా వుండాలి.  ఈ సమయంలో ఏమైనా తినటంవల్ల అనారోగ్యం కలుగవచ్చు.  అందుకని ఈ జాగ్రత్త.  అలాగే గ్రహణాన్ని నేరుగా కళ్ళతో చూడకూడదు.  ఎలాంటి ఉపకరణాలూ లేకుండా నేరుగా కంటితో గ్రహణాన్ని చూడటం వల్ల కంట్లో ఏర్పడే దోషాలను ఏ చికిత్సతోనైనా బాగు చేయటం చాలా కష్టమని పద్మశ్రీ డా. శివారెడ్డి, ప్రసిధ్ధ కంటి వైద్య నిపుణులు,  అన్నారు. 

గర్భస్ధ శిశువుల మీద గ్రహణ సమయంలో కిరణాల ప్రభావం చాలా వుంటుందని డా. అపర్ణా సక్శేనా గర్భస్ధ ఎలుకలమీద చేసిన ప్రయోగాలతో కనుగొన్నారు.  ఆ కిరణాలలో వుండో రేడియో ధార్మిక శక్తి  వలన ఆ ఎలుకలకి పుట్టిన పిల్లలలో ఎముకలు, మజ్జలో లోపాలు, అవయవాలు సరిగ్గా తయారు కాకపోవటం వగైరా లోపాలు కనుగొన్నారు.  అందుకే గర్భిణీలు గ్రహణ సమయంలో బయట తిరగకూడదన్నారు.

ఇంక దర్భల విషయం చూద్దాం.  ఇళ్ళల్లో శుభా శుభ కార్యాలకి వాడే దర్భలు చాలామందికి తెలిసే వుంటుంది.  గ్రహణం రోజున చాలామంది ఈ దర్బలని తాగే నీళ్ళమీదా, తినే వస్తువులమీదా, ఊరగాయలమీదా వేస్తారు.  కొందరు దీనిని ఎగతాళి చేస్తారు.  విక్రమ్ సారాబాయ్ పరిశోధనా  కేంద్రం చేసిన పరిశోధనలో గ్రహణ సమయంలో నీటి శ్రేష్టత తగ్గిపోతుందనీ, ఈ దర్భలవల్ల నీటి శ్రేష్టత పెరుగుతుందనీ కనుగొన్నారు.  వీటివల్ల మేలు జరుగుతోందని సైంటిఫిక్ గా పరిశోధనలు చేసి ఋజువు చేసిన తర్వాత ఈ పధ్ధతులు పాటించటం, పాటించకపోవటం అనేది మన ఇష్టాఇష్టాలమీద ఆధారపడి వుంటుంది.  మూఢ నమ్మకాలు అని సణుక్కుంటూ ఆచరించినా తప్పులేదు...ఆ మూఢ నమ్మకాలవల్ల మనకి మేలు జరిగేటప్పుడు. 

మన పూర్వీకులు ఏ సైన్స్ ఏ పరిశోధనలు లేని కాలంలో ఎంత విజ్ఞానంతో, ఎంత దూరం ఆలోచించి, ఎన్నో తరాలదాకా ప్రజలకి మేలు చేసే విషయాలనెన్నిచెప్పారో!!!   ఆశ్చర్యంగా వుంది కదూ!!!!!


(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)





3 comments

Sunday, January 3, 2010

షష్టిపూర్తి వగైరా ఉత్సవాలు ఎందుకు చేస్తారు?

Sunday, January 3, 2010


జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, పరాశరుడి వింశోత్తరి ప్రకారం, మనిషి ఆయుః ప్రమాణం 120 సంవత్లరాలు.  నవ గ్రహాలకివున్న దశలన్నీ కలిపితే 120 సంవత్సరాలు.  దీని ఆధారంగా మనిషి ఆయుష్షు ప్రమాణం నిర్ణయించి వుండవచ్చు.  మానవుడు పూర్ణాయుర్దాయంతో మృత్యుదోషాలు లేకుండా శాంతిగా బ్రతకాలనే ఉద్దేశ్యంతో ఈ ఉత్సవాలు జరుపుతారు.

బ్రతికున్నన్నాళ్లూ అందరూ ఆరోగ్యంగా వుండాలనే అనుకుంటారు.  కానీ మనిషికి 59 సంవత్సరాలు పూర్తయి, 60 వ సంవత్సరం రాంగానే ఉగ్రరధ అనే మృత్యుపీడ పీడిస్తుందట.  అందుకే 60 సంవత్సరాలు పూర్తికాగానే షష్టిపూర్తి చేస్తారు (ఆ మృత్యు పీడనుంచి తప్పించుకున్నందుకా)  అలాగే 70 వ సంవత్సరం ప్రారంభం కాంగానే భీమరధ అనే మృత్యు పీడ.  వీటిబారిన పడకుండా ఆయురారోగ్యాలతో వుండాలని శాంతి జరుపుతారు.   70 వ సంవత్సరాలకు చేసే ఈ శాంతి ప్రక్రియ గురించి సమాజంలో ఎక్కువమందికి తెలియదు.  చాలా తక్కువమంది చేసుకుంటారు ఈ ఉత్సవం.  84 సంవత్సరాల 3 నెలలు పూర్తి చేసుకున్నవారికి సహస్ర చంద్ర దర్శనం అని (వారు వెయ్యి పౌర్ణమిలు చూశారని) చాలా పెద్ద ఎత్తులో శాంతి ఉత్సవం చేస్తారు.  ఈ ఉత్సవాలన్నీకూడా మనిషికి  ఆయా వయసుల్లో వచ్చే మృత్యుపీడలు పోయి ఆరోగ్యంగా వుండాలనే ఉద్దేశ్యంతో చేసేవి.

ఇంకా కొన్ని ఉత్సవాలు వున్నాయి.  మనిషి పోయాక కూడా జయంతి, వర్ధంతి, శత జయంతోత్సవం లాంటివి.  ఇవి సమాజానికి గొప్ప సేవలు చేసినవారిని గుర్తు చేసుకోవటానికిగానీ, వారి వారి రంగాలలో గొప్ప నైపుణ్యాన్ని సంపాదించి తద్వారా సమాజ శ్రేయస్సుకు దోహద పడ్డవారిని గుర్తుచేసుకోవటానికిగానీ  ప్రజలు చేసే ఉత్సవాలు ఇవి.  ఈ ఉత్సవాలు వారు సమాజానికి చేసిన సేవలు గుర్తుచేసుకుని వారిని భక్తిపూర్వకంగా సంస్మరిస్తూ చేసే ఉత్సవాలు.  వీటివల్ల ఆ మహనీయులు సాధించిన విజయాలు గుర్తుచేసుకుని అందరూ ప్రేరణ పొందవచ్చు.

మరి కొన్ని ఉత్సవాలు...అవేనండీ...సినిమా శత దినోత్సవాలు, వజ్రోత్సవాలు వగైరా.  మరి ఇవి ఎందుకు చేస్తారు?   ఒక సినిమా మొదలు పెట్టిన దగ్గరనుంచీ పూర్తయ్యేదాకా ఎంతోమంది సమిష్టి కృషి, ఇంకెందరో సహకారం,  అందులో పని చేస్తున్నవారందరి మధ్యా సఖ్యతా అవసరమవుతాయి.  అలాగే ఆ సినిమా విజయవంతమవటానికి ప్రజల ఆదరణ చాలా అవసరం.  ఇలా ఎందరో సమిష్టి కృషి, ఆదరణ, ప్రోత్సాహం కారణంగా విజయవంతమయిన ఆ సినిమా శత దినోత్సవం వగైరా ఉత్సవాలమూలంగా వారి ఉత్సాహం ఇంకా పెరిగి ఇంకా ఇలాంటి మంచి చిత్రాలు  తియ్యటానికి బలాన్ని చేకూర్చుకుంటారు.

ఒక విధంగా ఈ ఉత్సవాలు టానిక్కులలాంటివి.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)
















1 comments

Saturday, January 2, 2010

ఆశీర్వచనం ఎందుకు చేస్తారు అసలు దానికి ప్రభావం వుంటుందా?

Saturday, January 2, 2010




భారతీయ సంస్కృతిలో ఆశీర్వచనానికి చాలా విలువ వుంది.  అనేక సందర్భాలలో చిన్నవారిని పెద్దవారు ఆశీర్వదిస్తారు.  విద్యార్ధులను విద్వా ప్రాప్తిరస్తు అని, పెళ్ళయిన ఆడవారిని దీర్ఘ సుమంగళీభవ అని, జన్మ సావిత్రీ భవ అని, పురుషులని దీర్ఘాయుష్మాన్ భవ వగైరా సమయానికి తగ్గట్లు వుంటాయి ఆ దీవెనలు.

యజ్ఞయాగాదులు చేసేటప్పుడు, వేదోక్తంగా జరిగే కార్యక్రమాలలో  అక్కడ పండితులు  గో బ్రాహ్మణో  శుభంభవతు, లోకాస్సమస్త సుఖినోభవంతు......... అనే ఆశీర్వచనంతో దేశంలో రాజు న్యాయంగా, ధర్మంగా పరిపాలించాలనీ, దేశం సుభిక్షంగా వుండాలనీ, గోవులు, బ్రాహ్మణులు,  ప్రజలందరూ సుఖంగా వుండాలనీ, దేశంలో సకాలంలో వర్షాలు కురిసి దేశం సుభిక్షంగా వుండాలనీ, పిల్లలు లేనివారికి పిల్లలు కలగాలనీ, వున్నవారికి వంశాభివృధ్ధి చేసే మనవలు కలగాలనీ, ధనం లేని వారికి సంపదలు కలగాలనీ, వగైరా సమాజంలో అందరి శ్రేయస్సు కోరుతూ ఆశీర్వచనం చేస్తారు.

అయితే ఈ ఆశీర్వచనాలకి ప్రభావం వుందా?  అవి ఫలిస్తాయా?   తప్పకుండా ఫలిస్తాయి.  సత్పధంలో నడిచే వారికి సత్పురుషులు చేసిన ఆశీర్వచనాలు తప్పక ఫలిస్తాయి.  ఈ ఆశీర్వచనాల వల్ల జాతకంలో వుండే దోషాలు తొలుగుతాయి, అకాల మృత్యు దోషాలు తొలుగుతాయి.  అంతేకాదు, పూర్వ జన్మ పాపాలు కూడా నాశనమవుతాయంటారు.

గురువులు, సిధ్ధులు, యోగులు, వేద పండితులు, మనకన్నా చిన్నవారైనా వారి కాళ్ళకి నమస్కరించి వారి ఆశీర్వచనం తీసుకోవచ్చు.  అక్కడ మనం నమస్కరించేది వారి వయసుకి కాదు, వారి విద్వత్తుకు, వారిలోని సరస్వతికి.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)


మనలో మాట
దేనికైనా నమ్మకం ముఖ్యం.   ఈ విషయాల్లో నమ్మకమున్నా లేక పోయినా పెద్దలని గౌరవించటం, విద్వత్తుని గౌరవించటం మన సంస్కారానికి నిదర్శనంకదా.


0 comments

Friday, January 1, 2010

సంతోషం సగం బలం అంటారు, ఎందుకు?

Friday, January 1, 2010




ఎప్పుడూ అందరూ సంతోషంగా వుండాలనీ, బాధలూ, కష్టాలూ లేకుండా హాయిగా వుండాలనే ఉద్దేశ్యంతోనే మన పెద్దలు సంతోషం సగం బలం అని చెప్పారు.  అయితే అందరూ ఎప్పుడూ సంతోషంగా వుండలేరు కదండీ.  మనుషులన్న తర్వాత కష్టాలూ తప్పవు.

అసలు మన మనుష్యులలో రెండు రకాలవారుంటారండీ.  ఒక రకంవారు  పాజిటివ్ ధింకర్స్.  ఎంత గడ్డు సమస్య ఎదురయినా నిబ్బరంగా వుంటారు.  సమస్య వచ్చిందని కంగారు పడకుండా దాన్ని తప్పించుకునే మార్గాన్ని వెతుక్కుంటారు.  అవసరాన్నిబట్టి అప్పటి ఆర్ధిక, సామాజిక, వాతావరణ ప్రభావాలూ, కుటుంబ సభ్యుల సానుకూలత వగైరాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఎలా చేస్తే ఆ సమస్య ఇబ్బంది లేకుండా పరిష్కారమవుతుందని ఆలోచించి, కుటుంబ సభ్యులతో, ఆత్మీయులతో చర్చించి పరిష్కార మార్గాన్ని నిర్ణయించుకుంటారు.  ధైర్యంగా ఆ సమస్యనెదుర్కుని విజయం సాధిస్తారు.

ఇంకో కోవకి చెందినవారుంటారండీ.  వారికి సమస్యలు లేకపోయినా అతి చిన్న విషయాలనుకూడా భూతద్దంలో చూసి, ఏవేవో ఆలోచనలు చేసి, ఇంకేవో ఊహించుకుని వాళ్ళు కంగారుపడి, చుట్టుపక్కలవారిని కంగారు పెట్టి, చివరికి చికాకు పెట్టి  కొండొకచో బాధపెట్టి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చివాట్లు తిని లేని సమస్యలలు కొని తెచ్చుకుని మరీ పెద్దవి చేసుకుంటారు.  ఏ రోజూ వాళ్ళు సుఖంగా వుండరు, చుట్టుప్రక్కలవారిని సుఖంగా వుండనీయరు.  ఇలాంటివారు మనవారయితే (అంటే మనం చెప్తే వినేవారయితే) నచ్చచెప్పి సరైన దోవలో పెట్టటం, లేకపోతే మన దోవ మనం చూసుకోవటం....అదేనండీ మన జాగ్రత్తలో మనం వుండటం వుత్తమం.  కదా

ఈ అనవసరమైన ఆలోచనలు, ఆందోళనలు, కోపతాపాలూ మనిషి శరీరం మీదకూడా చాలా పని చేస్తాయి.  బీపీ, నరాల బలహీనత, టెన్షన్, డిప్రెషన్, తెలిసినవీ తెలియనివీ అనేక రోగాలబారినపడి ఇంకా సమస్యలు పెరుగుతాయి.  అందుకునే ఈ బాధలేమీ కొని తెచ్చుకోకుండా మనం ప్రశాంతంగావుండి,  ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమస్య స్వరూప స్వభావాలగురించి సరైన ఆలోచనలుచేసి, అవసరమయితే ఆత్మీయుల సలహాలు తీసుకుని, సరైన నిర్ణయాలు తీసుకుని సరైన పరిష్కారాలు వెతుక్కుంటే మనం ఆరోగ్యంగా వుంటాం, ఆరోగ్యంగా వుంటే సంతోషంగా వుంటాం, మనం సంతోషంగా వుంటే మన చుట్టుపక్కలవారూ సంతోషంగా వుంటారు.  సంతోషం ఆరోగ్యానికి దారితీస్తుంది.  ఆరోగ్యం బలాన్నిస్తుంది.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)




3 comments