Saturday, January 2, 2010

ఆశీర్వచనం ఎందుకు చేస్తారు అసలు దానికి ప్రభావం వుంటుందా?

Saturday, January 2, 2010




భారతీయ సంస్కృతిలో ఆశీర్వచనానికి చాలా విలువ వుంది.  అనేక సందర్భాలలో చిన్నవారిని పెద్దవారు ఆశీర్వదిస్తారు.  విద్యార్ధులను విద్వా ప్రాప్తిరస్తు అని, పెళ్ళయిన ఆడవారిని దీర్ఘ సుమంగళీభవ అని, జన్మ సావిత్రీ భవ అని, పురుషులని దీర్ఘాయుష్మాన్ భవ వగైరా సమయానికి తగ్గట్లు వుంటాయి ఆ దీవెనలు.

యజ్ఞయాగాదులు చేసేటప్పుడు, వేదోక్తంగా జరిగే కార్యక్రమాలలో  అక్కడ పండితులు  గో బ్రాహ్మణో  శుభంభవతు, లోకాస్సమస్త సుఖినోభవంతు......... అనే ఆశీర్వచనంతో దేశంలో రాజు న్యాయంగా, ధర్మంగా పరిపాలించాలనీ, దేశం సుభిక్షంగా వుండాలనీ, గోవులు, బ్రాహ్మణులు,  ప్రజలందరూ సుఖంగా వుండాలనీ, దేశంలో సకాలంలో వర్షాలు కురిసి దేశం సుభిక్షంగా వుండాలనీ, పిల్లలు లేనివారికి పిల్లలు కలగాలనీ, వున్నవారికి వంశాభివృధ్ధి చేసే మనవలు కలగాలనీ, ధనం లేని వారికి సంపదలు కలగాలనీ, వగైరా సమాజంలో అందరి శ్రేయస్సు కోరుతూ ఆశీర్వచనం చేస్తారు.

అయితే ఈ ఆశీర్వచనాలకి ప్రభావం వుందా?  అవి ఫలిస్తాయా?   తప్పకుండా ఫలిస్తాయి.  సత్పధంలో నడిచే వారికి సత్పురుషులు చేసిన ఆశీర్వచనాలు తప్పక ఫలిస్తాయి.  ఈ ఆశీర్వచనాల వల్ల జాతకంలో వుండే దోషాలు తొలుగుతాయి, అకాల మృత్యు దోషాలు తొలుగుతాయి.  అంతేకాదు, పూర్వ జన్మ పాపాలు కూడా నాశనమవుతాయంటారు.

గురువులు, సిధ్ధులు, యోగులు, వేద పండితులు, మనకన్నా చిన్నవారైనా వారి కాళ్ళకి నమస్కరించి వారి ఆశీర్వచనం తీసుకోవచ్చు.  అక్కడ మనం నమస్కరించేది వారి వయసుకి కాదు, వారి విద్వత్తుకు, వారిలోని సరస్వతికి.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)


మనలో మాట
దేనికైనా నమ్మకం ముఖ్యం.   ఈ విషయాల్లో నమ్మకమున్నా లేక పోయినా పెద్దలని గౌరవించటం, విద్వత్తుని గౌరవించటం మన సంస్కారానికి నిదర్శనంకదా.


0 comments: