Tuesday, January 12, 2010

గ్రహణం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?

Tuesday, January 12, 2010




ఆధ్యాత్మికంగా గ్రహణం సమయానికి చాలా విశేషముంది.  గ్రహణం పట్టగానే స్నానం చేసి దీపారాధన చేసి జపం చేసుకుంటే విశేష ఫలితాన్నిస్తుంది.  ముఖ్యంగా నదీ స్నానం చేసి, నదీ తీరాన జపం చేసుకుంటే ఆ ఫలితం ఇంకా ఎక్కువ.

గ్రహణ సమయంలో దేవాలయాలన్నీ మూసేస్తారు కదా,  మరి జపం చెయ్యమంటున్నారు,      అసలు దేవాలయాల్ని ఎందుకు మూస్తారు అనే సంశయంకలగవచ్చు.  ఆగమ  శాస్త్రానుసారం గ్రహణ సమయంలో దేవాలయాల్ని మూసి, తర్వాత ప్రోక్షణ చేసి పూజలు ప్రారంభించాలి.  అందుకే దేవాలయాలు మూసివేస్తారు.

జపం చేసుకోమన్నారుకదాని ఇళ్ళల్లోకూడా దేవతా విగ్రహాలను, పటాలను తాకి పూలు పెట్టి పూజ చెయ్యకూడదు.  కేవలం మానసిక జపం మాత్రమే చెయ్యాలి.  గ్రహణం సమయంలో చేసే జపం మామూలుగా చేసే దానికన్నా అనేక రెట్లు ఎక్కువ ఫలితాన్నిస్తుందంటారు.  గ్రహణ సమయంలో ఆవు నెయ్యతో దీపారాధన చేసి, దాని ముందు కూర్చుని జపం చేస్తే, ఆ మంత్రంతో హోమం చేసినంత ఫలితాన్నిస్తుంది. ఏదైనా మంత్రం అక్షర లక్షలు చేసినప్పుడు మంత్రసిధ్ధి కలుగుతుంది.  అంటే మంత్రంలో ఎన్ని అక్షరాలు వున్నాయో (ముందునుంచి వెనుకకి, వెనకనుంచి ముందుకి) అన్న లక్షలసార్లు  ఆ మంత్రాన్ని శ్రధ్ధా భక్తులతో జపిస్తే మంత్రం సిధ్ధిస్తుందంటారు. 

అయితే అందరూ ఈ జపాలు చేయలేరు.  శారీరకంగా అశక్తులు వుండవచ్చు, ఉద్యోగరీత్యా, ఇంకా ఇతర పనులవల్ల కుదరకపోవచ్చు.  అలాంటివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమైనా వున్నాయా.  శాస్త్ర ప్రకారం సూర్య గ్రహణానికి 12 గం. ముందునుంచీ, చంద్ర గ్రహణానికి 9 గం.ల ముందునుంచీ కడుపు ఖాళీగా వుండాలి.  ఈ సమయంలో ఏమైనా తినటంవల్ల అనారోగ్యం కలుగవచ్చు.  అందుకని ఈ జాగ్రత్త.  అలాగే గ్రహణాన్ని నేరుగా కళ్ళతో చూడకూడదు.  ఎలాంటి ఉపకరణాలూ లేకుండా నేరుగా కంటితో గ్రహణాన్ని చూడటం వల్ల కంట్లో ఏర్పడే దోషాలను ఏ చికిత్సతోనైనా బాగు చేయటం చాలా కష్టమని పద్మశ్రీ డా. శివారెడ్డి, ప్రసిధ్ధ కంటి వైద్య నిపుణులు,  అన్నారు. 

గర్భస్ధ శిశువుల మీద గ్రహణ సమయంలో కిరణాల ప్రభావం చాలా వుంటుందని డా. అపర్ణా సక్శేనా గర్భస్ధ ఎలుకలమీద చేసిన ప్రయోగాలతో కనుగొన్నారు.  ఆ కిరణాలలో వుండో రేడియో ధార్మిక శక్తి  వలన ఆ ఎలుకలకి పుట్టిన పిల్లలలో ఎముకలు, మజ్జలో లోపాలు, అవయవాలు సరిగ్గా తయారు కాకపోవటం వగైరా లోపాలు కనుగొన్నారు.  అందుకే గర్భిణీలు గ్రహణ సమయంలో బయట తిరగకూడదన్నారు.

ఇంక దర్భల విషయం చూద్దాం.  ఇళ్ళల్లో శుభా శుభ కార్యాలకి వాడే దర్భలు చాలామందికి తెలిసే వుంటుంది.  గ్రహణం రోజున చాలామంది ఈ దర్బలని తాగే నీళ్ళమీదా, తినే వస్తువులమీదా, ఊరగాయలమీదా వేస్తారు.  కొందరు దీనిని ఎగతాళి చేస్తారు.  విక్రమ్ సారాబాయ్ పరిశోధనా  కేంద్రం చేసిన పరిశోధనలో గ్రహణ సమయంలో నీటి శ్రేష్టత తగ్గిపోతుందనీ, ఈ దర్భలవల్ల నీటి శ్రేష్టత పెరుగుతుందనీ కనుగొన్నారు.  వీటివల్ల మేలు జరుగుతోందని సైంటిఫిక్ గా పరిశోధనలు చేసి ఋజువు చేసిన తర్వాత ఈ పధ్ధతులు పాటించటం, పాటించకపోవటం అనేది మన ఇష్టాఇష్టాలమీద ఆధారపడి వుంటుంది.  మూఢ నమ్మకాలు అని సణుక్కుంటూ ఆచరించినా తప్పులేదు...ఆ మూఢ నమ్మకాలవల్ల మనకి మేలు జరిగేటప్పుడు. 

మన పూర్వీకులు ఏ సైన్స్ ఏ పరిశోధనలు లేని కాలంలో ఎంత విజ్ఞానంతో, ఎంత దూరం ఆలోచించి, ఎన్నో తరాలదాకా ప్రజలకి మేలు చేసే విషయాలనెన్నిచెప్పారో!!!   ఆశ్చర్యంగా వుంది కదూ!!!!!


(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)





3 comments:

Truely said...

naaku nachhai meeru cheppina vishayalu

webtelugu said...

Wats your rank in webtelugu topsites??

WEBTELUGU.COM the Telugu topsites directory

Hai friend add your blog/website to webtelugu.com and get more traffic for your site .Its a new telugu topsite directory .Your blog readers vote for your site also ... go and add your site herehttp://www.webtelugu.com/

psm.lakshmi said...

thank you
psmlakshmi